మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలోని జాకారం గ్రామపంచాయతీలో ఉప సర్పంచ్తో నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి, మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
ఉప సర్పంచ్ వేధింపులే కారణమా….?
గ్రామంలో ఉప సర్పంచ్గా ఉన్న తనకు గ్రామపంచాయతీలో ప్రత్యేక గుర్తింపు కల్పించాలని, తన కోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేసి చాంబర్ ఏర్పాటు చేయాలని సర్పంచ్పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో తాను సొంతంగా కొనుగోలు చేసిన కుర్చీలు, టేబుళ్లు పెట్టుకునేందుకు ప్రత్యేక గది ఇవ్వాలని పలుమార్లు డిమాండ్ చేసినట్లు వార్డు నెంబర్లు చెబుతున్నారు.
ఈ విషయంపై సర్పంచ్తో తరచూ వాగ్వాదాలు జరుగుతుండగా, గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులపై సంతకాలు చేయడం విషయంలో కూడా ఉప సర్పంచ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
మహిళా సర్పంచ్పై ఒత్తిడి…..
గ్రామ అవసరాల కోసం చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులపై సంతకాలు చేయడాన్ని ప్రశ్నిస్తూ, ప్రతి చిన్న విషయాన్ని సమస్యగా మారుస్తూ ఉప సర్పంచ్ మరియు అతని తమ్ముడు కలిసి తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, మహిళా సర్పంచ్ కావడంతో తనను అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని జాకారం సర్పంచ్ సమత ఆరోపిస్తుంది. ఈ వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన సర్పంచ్ గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆమెను ములుగు జిలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో వెంటనే వైద్యులు పరీక్షించి, వైద్య చికిత్సలు అందించారు.ప్రస్తుతం బాధితురాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు…
ఈ ఘటన బయటకు రావడంతో జాకారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా ప్రజాప్రతినిధిపై ఇలాంటి వేధింపులు జరిగాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


