కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో కళాశాలలకు బకాయిపడ్డ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్, 16న తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్ కు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల రూపాయలు, ఇప్పటికే టోకెన్ జనరేట్ చేసిన 1200 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం మాత్రమే ప్రైవేటు విద్యాసంస్థల నిరసనకు మద్దతు తెలుపుతున్నామని, విద్యార్థులకు నష్టం చేసే చర్యలకు ప్రభుత్వంగాని, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు గానీ పూనుకుంటే ప్రతిఘటన చర్యలకు దిగుతామన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.


