కేసులకు భయపడం
సోనియా, రాహుల్ను మానసికంగా వేధిస్తారా ?
నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థికసాయం నేరమా?
దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం వెలకట్టలేనిది
కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను బయటకు తరలిస్తాం
పెరి అర్బన్ రీజియన్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం
సీఎం రేవంత్ రెడ్డి
గాంధీభవన్లో పీసీసీ వర్కింగ్ కమిటీ సమావేశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీపై కేసులు పెడితే భయపడేది లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థికసాయం మాత్రమే అందించారని తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో పని చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని.. ఈనేపథ్యంలో ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందిని మంచి ఆలోచనతో వీరు ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తు చేశారు. పత్రికను తిరిగి నడిపించాలనే ఉద్దేశ్యంతో బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నేతలను తీసుకున్నారన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలో కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను సోదాహరణంగా వివరించారు. ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధించినది కాదని, ఎవరూ జేబులో ఒక్క రూపాయి కూడా వేసుకోలేదని తెలిపారు. ఆస్తులన్నీ నెహ్రూవేనని వారసత్వంగా ఉన్న పత్రికను నడపాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినట్లు చెప్పారు. మనీలాండరింగ్ కేసు, ఈడీ కేసులు పెట్టి మానసికంగా సోనియా, రాహుల్ గాంధీలను వేధిస్తారా? అంటూ బీజేపీపై మండిపడ్డారు.

నాలుగు విమానాశ్రయాలకు త్వరలోనే శిలాఫలకాలు
హైదరాబాద్ నగరం లోపల కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను బయటకు తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు అవతల రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ వస్తోందని వెల్లడించారు. తెలంగాణకు మరో నాలుగు విమానాశ్రయాలు వస్తున్నాయన్నారు. వాటికి త్వరలోనే శిలాఫలకాలు వేసుకుందామన్నారు. కోటిమంది మహిళలకు కోటి చీరలు ఇవ్వాలని నిర్ణయించి, ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ ప్రభుత్వం చీర రూపంలో సారె పెడుతుందని సీఎం పేర్కొన్నారు.

ఉస్మానియాను ప్రపంచస్థాయిలో నిలబెడతాం
డిసెంబర్ 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తామని చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామన్నారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని ఆయన ప్రకటించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. 9వ తేదీన తెలంగాణ – 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి దిగ్గజ నేతల సలహాలు సైతం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఓఆర్ఆర్ బయటకు పరిశ్రమలు..
కోర్ అర్బన్ను క్యూర్ చేయాలని తాము నిర్ణయించామన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, పరిశ్రమల తరలింపు తదితర అంశాలు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించారు. కొన్ని పరిశ్రమలు నడిచే పరిస్థితి లేక మూతపడ్డాయన్నారు. మరికొన్ని పరిశ్రమల ఊరు, నగరం నడిబొడ్డున ఉన్నాయని.. ఆయా పరిశ్రమలను తరిలిస్తే కొంత భూమి అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్పై ఫైర్..
అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకెళ్తున్నామన్నారు. గత పదేళ్లలో తెలంగాణకు ఒక్క ఎయిర్పోర్టు కూడా తేలేదంటూ బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఎయిర్పోర్టులు తెచ్చామని గుర్తు చేశారు. సంక్షోభంలో ఉన్న తెలంగాణను సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నామని వివరించారు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. అందరి కృషితో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు.
డీసీసీలకు వార్నింగ్..
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కోటి మంది మహిళలకు చీరలు అందించడమే తమ లక్ష్యమన్నారు. చీరలు అందలేదంటూ ఫిర్యాదులు వస్తే అందుకు డీసీసీలదే బాధ్యత అంటూ సీఎం హెచ్చరించారు. డిసెంబర్ నెలాఖరులోగా మహిళలందరికీ చీరలు అందించాలని డీసీసీలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.



