నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి
ఈటల డిమాండ్
హుజూరాబాద్ ప్రజలే నా బలం ఎలా మర్చిపోతా ఈటల
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. పంటలు చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిల్లర్లు ధాన్యం దింపుకునే విషయంలో రోజులు లాగుతున్నారు. క్వింటాల్కు ఎనిమిది కిలోలా తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. సన్నవడ్లకు ప్రకటించిన రూ.500 బోనస్ ఇప్పటికీ అందరికీ చేరలేదని, ఈసారి అయినా ప్రతి రైతుకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.రైతు రుణమాఫీ పేరుతో ఇచ్చిన హామీ కూడా ఇంకా నెరవేరలేదని, వరదలతో మునిగిన వరి రైతులు, తుఫానుతో నష్టపోయిన రైతులు అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల సహాయం వెంటనే అందేలా చూడాలన్నారు. పత్తి కొనుగోళ్లలో కూడా జాప్యం ఉండకూడదని, కఠినమైన ‘7 క్వింటాళ్ల’ నిబంధనను ఎత్తివేయాలని, వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీసీఐ కూడా నిబంధనలు సడలించాలని కోరారు. ఫసల్ భీమా చెల్లింపులు ప్రభుత్వం సమయానికి చేస్తే రైతులు ఇబ్బందులు పడేవారేమన్నారు.
హుజూరాబాద్లో మాకు మెజారిటీ సీట్లు ఈటల ధీమా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండేందుకే వారి పాత్ర కీలకమని చెప్పారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నందున బూతు స్థాయిలో పటిష్ట బలం ఏర్పరుస్తామని ప్రకటించారు. జిల్లాలోని 107 గ్రామ పంచాయతీల్లో ఎక్కువ భాగం తమ పార్టీ గెలుచుకునే సత్తా ఉందన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచినా, ఓటేసిన ప్రజలు ఎదురుచూసిన పనులు రెండు సంవత్సరాలుగా జరగకపోవడం ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు.నన్ను 25 సంవత్సరాలుగా గుండెల్లో పెట్టుకున్న హుజూరాబాద్ గడ్డ ఆ ప్రజలను ఎలా మర్చిపోతా అని భావోద్వేగంతో చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, చీకట్లోనే రోజులు గడుస్తున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు.
ఉన్నదాన్ని చెప్పుకోలేని వారు అబద్ధాలతో బ్రతుకుతున్నారు
తాము చేసిన అభివృద్ధి పనులను ఎప్పుడూ ప్రచారం చేయలేదని, ధర్మాన్ని, ప్రజలను, పనిని నమ్ముకున్న వాడినేనని ఈటల అన్నారు.తట్టెడు మట్టి తీయలేదంటారా హుజూరాబాద్లో వేగవంతమైన నాలుగు లైన్లు ఎవరు వేశారు? కరెంట్ కోసం కంటిరెప్పపాటు ఎదురు చూడని విధంగా సబ్స్టేషన్లు ఎవరు నిర్మించారు? జలకళ కోసం చెక్డ్యామ్లు ఎవరు కట్టించారు? కమలాపూర్ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.ఇవన్నీ ప్రజలకు తెలుసు దొంగముఖాలకు అర్థం కాదు. అబద్ధాలే ఆధారంగా బ్రతికే వారికి ప్రజలే బుద్ధి చెప్తారు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభా, బీజేపీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, మాజీ సర్పంచ్ సురేందర్ రాజు, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మహిళా మోర్చా జిల్లా ప్రతినిధి రమరెడ్డి, పార్టీ నాయకులు సమ్మయ్య, దేవిక, చొప్పరి వేణు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


