కాకతీయ, బయ్యారం: వ్యవసాయంలో సేంద్రీయ పద్ధతులను పాటిస్తూ, భూసారాన్ని కాపాడుతూ, భూమి పరీక్షల ఆధారంగా పంటలు వేయాలని, కార్పొరేట్ సంస్థల మాటల విని రైతులు మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా కేసముధ్రం మండలం ఈదులపూసపెల్లి గ్రామంలో నూకల రఘునాథరెడ్డి, అభినవరెడ్డి ఫౌండేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అరబిందో ఫార్మా ఫౌండేషన్, జన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యానవన పరిశోధన కేంద్రం (జే వి ఆర్ హెచ్ ఆర్ సి) ఆధ్వర్యంలో నేచురల్ ఫార్మింగ్ ట్రైనింగ్ బి.ఆర్.సి సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రైతు కమిషన్ నాయకులు భూ భారతి సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, భవాని రెడ్డి తదితరులు హాజరయ్యారు.
సోలేటి అభిమాన రెడ్డి ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించి జయపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంను పరిశీలించారు. అనంతరం నేచురల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో రైతులు రసాయనిక ఎరువులు, ఫెర్టిలైజర్స్,ఫెర్టిసైడ్స్ మోతాదుకు మించి వాడుతూ భూసారాన్ని నిస్సత్తువగా చేస్తున్నారని అన్నారు. దీనితో రాబోవు రోజులలో ఏ పంటలు పండవని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మన పూర్వీకులు రైతులు సేంద్రియ వ్యవసాయం చేసి భూమి సారాన్ని కాపాడుతూ నాణ్యమైన పంటలు పండించారన్నారు.
పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు విత్తన సంస్థల, పురుగుమందుల పేరిట రైతులకు నకిలీ విత్తనాలను, జన్యు మార్పిడి విత్తనాలను, రైతులకు అంటగడుతూ కోట్లు గడిస్తూ, రైతులను నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ములుగు జిల్లాలు కొన్ని విత్తన కంపెనీలు మొక్కజొన్నలను విత్తనాలను ఇచ్చి మోసగించాయని, వారు వేసిన మొక్కజొన్న కంకి పంట తినడం వల్ల పశువులు, రైతులు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి వల్ల భూసారం కోల్పోయి మనిషి జీవన విధానంలో, వాతావరణంలో పెను మార్పులు సంభవించడం చూస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా రైతులు సేంద్రియ వ్యవసాయం చేసి లాభాలు ఘటించాలని సూచించారు.
రైతులకు అనేక హక్కులు ఉన్నాయని, విత్తన చట్టం ఇతర చట్టాలపై అవగాహన లేకపోవడం వలన రైతుల నష్టపోతున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.20 వేల కోట్లు రుణమాఫీ, రైతు భరోసా కోసం 15 రోజుల్లో రూ.9వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.
కేంద్రప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం కోసం దేశంలో రైతులను ప్రోత్సహించడానికి రెండువేల కోట్లు ఇవ్వడం ఏమాత్రం సరిపోదని, దానిని లక్ష కోట్ల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రైతు కమిషన్ సభ్యులకు పకృతి వ్యవసాయ ప్రేమికుడు జైపాల్ రెడ్డి మెమోంటో, జ్ఞాపికలను బహుకరించారు.
రాష్ట్రంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఉండే ఆదర్శ రైతుల వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ఆదర్శ రైతుల సంఘం ఉపాధ్యక్షుడు గుండ్రాతి భాస్కర్ రెడ్డి, మహబూబాబాద్ డివిజన్ ఆదర్శ రైతులు అజ్మీరా వెంకన్న, ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతు కమిషన్ నాయకులను కలిసి వేడుకున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎఫ్ పి ఓ ఫౌండేషన్ అడ్వైజర్ నంద్యాల నరసింహారెడ్డి, పి జె టి ఏ యు హరీష్ ఖాన్, ప్రకృతి సేద్య నిపుణుడు కుడుముల వెంకటరెడ్డి, జేవీఆర్ హెచ్ఆర్సీ రాష్ట్ర శాస్త్రవేత్త నాగరాజు, మహేష్, భారతీయ కిసాన్ మోర్చా నాయకులు గోపాల్, మహబూబాబాద్ డివిజనల్ వ్యవసాయ అధికారి శ్రీనివాస్ నాయక్, కేసముద్రం ఏవో, ఏఈఓలు, సేంద్రీయ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.


