- వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
కాకతీయ, వర్ధన్నపేట : పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య అన్నారు. మంగళవారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2025- 26 కు గాను ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర రూ. 8110 /- లుగా నిర్ణయించిందని తెలిపారు. ప్రతీ రైతు తమ పత్తి సరుకును ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐకి అమ్ముటకు గాను జిన్నింగ్ మిల్లుకు తీసుకు వచ్చే ముందే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పత్తి పంట వేసినట్లు నమోదు తప్పని సరిగా చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత సీసీఐకి సంబందించిన కిసాన్ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రావాలని ఆయన స్పష్టం చేశారు. స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన రైతుల కాటన్ మాత్రమే సీసీఐ కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

అలాగే పత్తిని అరబెట్టి తేమ శాతం 12 శాతం లోపు ఉండే విధంగా చెత్త చెదారం లేకుండా శుభ్రం చేసుకుని తీసుకొనిరావాలన్నారు. 8 శాతం కన్నా ఎక్కువగా ఉంటే ఒక్కో శాతం పెరిగే కొద్దీ క్వింటాలుకు రూ. 81 రూపాయలు తగ్గుతుందన్నారు. తదుపరి జిన్నింగ్ మిల్లుకు వచ్చేటపుడు రైతు వెంట ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్ జీరాక్సులు, ఆధార్ కార్డుకు లింక్ అయిన సెల్ నెంబర్ వెంట తెచ్చుకోవలని కోరారు. ఆధారుతో అనుసంధానం అయిన బ్యాంకులో మాత్రమే పత్తి అమ్మిన డబ్బులు జమ చేయబడుతయాన్నారు. పూర్తి వివరాల కోసం 18005995779, వాట్సప్ చాట్ సేవలకు 8897281111 నంబర్లను వినియోగించుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని మధ్యధళారులకు అమ్ముకొని మోసపోకుండా సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద మాత్రమే అమ్ముకొని మద్దతు ధర పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


