సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు
గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం వచ్చిన రైతుకు నిరాకరణ
సొసైటీ అప్పు క్లియర్ చేస్తేనే రుణం అంటున్న బ్యాంకు
వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న రైతు
డీసీసీబీ మేనేజర్ వైఖరిపై రైతుల ఆగ్రహం
అకౌంట్ వేరు అయినా బలవంతంగా 10000 చెల్లింపు
వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలంటూ డిమాండ్
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలంలో డీసీసీబీ బ్యాంకు మేనేజర్ వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ లోన్ తీసుకున్న ఓ పేద రైతును సొసైటీ అప్పు పేరుతో వేధిస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. కూసుమంచి మండలం లోక్యాతండా గ్రామానికి చెందిన వడిత్య మల్సూర్ అనే రైతు గత సంవత్సరం మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవల వ్యవసాయ పనులకు పెట్టుబడి అవసరం కావడంతో గోల్డ్ లోన్ రెన్యువల్ చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అయితే బ్యాంకు మేనేజర్ సొసైటీలో నీకు అప్పు ఉందని, ముందుగా ఆ అప్పు క్లియర్ చేస్తేనే గోల్డ్ లోన్ రెన్యువల్ చేస్తామని చెప్పినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు. సొసైటీ అప్పు వేరు, బ్యాంకు రుణం వేరు అయినప్పటికీ రెండింటిని కలిపి కొత్త షరతులు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. సొసైటీ లోన్ మొత్తం విషయంలో కూడా సందేహాస్పద పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. సొసైటీకి సంబంధించిన బకాయిల్లో భాగంగా 10000 రూపాయలను డీసీసీబీ బ్యాంకు ఖాతాలో చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారని రైతు తెలిపాడు. అంతేకాకుండా మిగిలిన అప్పు చెల్లిస్తామని ఒక లేఖ కూడా రాయించుకున్నారని సమాచారం. ఇంత జరిగినప్పటికీ రైతుకు గోల్డ్ లోన్ రెన్యువల్ చేయకుండా బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. అత్యవసరంగా డబ్బులు అవసరమైన సమయంలో ఇలా ఇబ్బందులు పెట్టడం వల్ల రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయ పనులు, కుటుంబ అవసరాల కోసం రైతులు తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారని, అలాంటి సమయంలో బ్యాంకు అధికారులు సహకరించాల్సిన బదులు అడ్డంకులు సృష్టించడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డీసీసీబీ బ్యాంకు మేనేజర్ వైఖరిపై విచారణ జరిపి రైతుకు న్యాయం చేయాలని రైతులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు సహాయం చేయాల్సిన బ్యాంకు అధికారులు ఇబ్బందులు కల్పించడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.


