ఆర్థిక భారంతో రైతు ఆత్మహత్య
కాకతీయ, హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో బత్తుల రమేష్ (45) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీమదేవరపల్లి మండలం దద్దగిరి గ్రామానికి చెందిన రమేష్ సుమారు 25 సంవత్సరాల క్రితం ఆకునూరు గ్రామానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నాడు. తన కుమార్తె ఉన్నత చదువుల కోసం అప్పులు తీసుకున్నాడు. అయితే ఆ అప్పులు తీర్చలేక తీవ్ర మనస్థాపానికి గురై, గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


