డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం
రహదారి భద్రతపై అవగాహన
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ
కాకతీయ, ఖమ్మం: డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమని, చూపు స్పష్టంగా ఉంటేనే వాహనాన్ని సురక్షితంగా నడపగలుగుతారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఎంటీఆర్ సర్కిల్ సమీప హైవేపై భారీ వాహనాల డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సహాయ పోలీసు అధికారి శ్రీనివాసులు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యశాల సహకారంతో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. శిబిరంలో నూరుపైగా డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చారు. వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించడం సహజమని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సంకేతాలు, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపవచ్చని తెలిపారు.


