గోదావరిలో డీసిల్టింగ్ పేరుతో దోపిడీ!
సీతమ్మ సాగర్ నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు
ఎన్జీటీ ఆదేశాలను పక్కన ఇసుక తవ్వకాలు
ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న చోట అక్రమంగా డీసిల్టింగ్
ఎన్జీటీ ఆదేశాలకే ఎగనామం వేస్తున్న వైనం
అనుమతుల్లేకుండా నిర్మాణాల కొనసాగింపుపై స్థానికుల నుంచి ఆగ్రహం
డీసిల్టింగ్ పేరిట గోదావరిలో భారీ తవ్వకాలు
అడ్డు చెప్పని ఇరిగేషన్–మైనింగ్ శాఖల అధికారులు
అనుమతుల్లేకుండానే తవ్వకాలు జరుగుతున్నాయా..?!
మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్న భూనిర్వాసితులు
కాకతీయ, మణుగూరు : ఆగిపోయిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సమీపంలోని గోదావరిలో జరుగుతున్న డీసిల్టింగ్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు ఉన్నా, డీసిల్టింగ్ పేరుతో భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు సాగుతుండటం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. ప్రభుత్వ శాఖల అనుమతులతోనే ఈ ప్రక్రియ జరుగుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. దుమ్ముగూడెం, పాములపల్లి, కుమ్మరిగూడెం, అమ్మగారిపల్లి గ్రామాలకు చెందిన భూనిర్వాసిత రైతులు ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణం కొనసాగుతోందని ఆరోపిస్తూ తెల్లం నరేశ్, బూర లక్ష్మీనారాయణలు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారలేదని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేపట్టి వాహనాలను అడ్డుకున్నారు. భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయకుండానే పనులు కొనసాగించడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


డీసిల్టింగ్ పేరిట గోదావరి తవ్వకాలు
మణుగూరు, అశ్వాపురం పరిధిలోని రామ్ నగర్, బట్టీల గుంపు, కోడి ముత్తయ్య గుంపు, చిన్నరాయిగూడెం, అనంతారం, అన్నారం, పద్మగూడెం, విజయనగరం, గుల్లసింగారం ప్రాంతాల్లో గోదావరిలో భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. డీసిల్టింగ్ పేరుతో జరుగుతున్న ఈ పనులు వాస్తవానికి ఇసుక తవ్వకాలేనని స్థానికులు అంటున్నారు. లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నది సహజ స్వరూపం దెబ్బతింటోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి తీర ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతకు ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన పరిస్థితిలో డీసిల్టింగ్కు అనుమతులు ఎలా వచ్చాయన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. గతంలో ప్రాజెక్టు కోసం ఇసుక తీయాలనే ప్రణాళిక ఉన్నప్పటికీ, పనులు నిలిపివేయాలన్న ఆదేశాల తర్వాత కూడా అనుమతులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇరిగేషన్, మైనింగ్ శాఖలే ఈ అనుమతులు ఇచ్చాయని రైతులు ఆరోపిస్తున్నారు. తాసిల్దార్, మండల సర్వేయర్ అనుమతులు లేకుండానే ఎలా అనుమతులు ఇచ్చారన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. లంక భూముల నుంచి ఇసుక తీయడానికి కఠిన నిబంధనలు ఉన్నా, ఇక్కడ మాత్రం వాటిని పక్కనబెట్టారని విమర్శిస్తున్నారు. పర్యావరణ శాఖ పాత్ర కూడా ప్రశ్నార్థకంగా మారింది. గోదావరిలో జరుగుతున్న ఈ విధ్వంసంపై కనీసం స్పందన లేకపోవడం ఆ శాఖ పనితీరుపై సందేహాలు కలిగిస్తోంది.
ఆగిన ప్రాజెక్టు… కొనసాగుతున్న తవ్వకాలు
ఎన్జీటీ ఆదేశాలతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు పునఃప్రారంభం కాలేదు. కానీ అదే ప్రాజెక్టు పేరుతో డీసిల్టింగ్ మాత్రం కొనసాగుతోంది. దీంతో అసలు లక్ష్యం ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. రైతుల మాటలో చెప్పాలంటే… ప్రాజెక్టు లేకుండా పూడికల తీయడం ఎందుకు? రైతుల భూముల విషయంలో నిర్లక్ష్యం చూపుతున్న అధికారులు ఇసుక విషయంలో మాత్రం ఎందుకు చురుకుగా ఉన్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి ఆదాయం వస్తోందనే పేరుతో గోదావరిని నాశనం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలు పక్కనబెట్టి ఆదాయంపైనే దృష్టి పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూనిర్వాసిత రైతులు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపివేయాలని, డీసిల్టింగ్ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలని, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, పర్యావరణ కార్యకర్తలు కోరుతున్నారు. అధికారుల మౌనం కొనసాగితే ఈ ఉద్యమం మరింత ఉధృతం కావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన ప్రాజెక్టు పేరుతో గోదావరిలో జరుగుతున్న ఈ తవ్వకాలు సాధారణం కావు. ఇది పరిపాలనా లోపమా… లేక ప్రణాళికాబద్ధ దోపిడీయా అన్న ప్రశ్న ఇప్పుడు మణుగూరు నుంచి రాష్ట్రస్థాయికి విస్తరిస్తోంది. గోదావరి గుండెను కోసుకుంటూ సాగుతున్న ఈ తవ్వకాలకు బ్రేక్ వేస్తారా… లేక ఇదే ధోరణి కొనసాగుతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.


