ధరణి పోయినా దోపిడీ ఆగలేదా?
అమలు కాని భూభారతి లక్ష్యాలు
ఆశయాలకు దూరంగా భూభారతి అమలు తీరు
భూమి రేట్లలో ధరణి – భూ భారతి తేడా ఏంటి?
మార్కెట్ ధరల్లో గణనీయమైన వ్యత్యాసాలను తహసీల్దార్ సవరించగలరా?
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్, రికార్డు నిర్వహణ కోసం 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రారంభించింది. భూమి ఆన్లైన్ మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అన్నీ ఒకే ప్లాట్ఫారమ్లో పెట్టి పారదర్శకత పెంచుతామని అప్పట్లో ప్రభుత్వం చెప్పినా, ప్రాక్టికల్గా రైతులు, చిన్న భూస్వాములు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ధరణి పోర్టల్లో జిల్లా,మండలం, గ్రామం, సర్వే నంబర్ ఎంపిక చేస్తే, ఆన్లైన్ లో భూమి మార్కెట్ విలువ ఆటోమేటిక్గా కనిపించే విధంగా సిస్టమ్ రూపొందించారు. ఈ రేట్లను సర్కిల్ రేట్లు, యూనిట్ రేట్లు అంటూ ప్రభుత్వమే పైస్థాయిలో ఫిక్స్ చేసి, సాధారణంగా రైతు స్థితి లేదా భూమి వాస్తవ ఉపయోగం (పొలంగా ఉందా, బంజరా భూములు, చెలక భూములు) వంటి అంశాలు ఫీల్డ్ స్థాయిలో తహసిల్దార్ చెక్ చేసి తగ్గించే అవకాశం లేకుండా ఉండేది. దీని వలన రేట్లు పెరగడం వల్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ప్రోపోర్షన్గా పెరిగి, రిజిస్ట్రేషన్కు వెళ్లే ప్రతి రైతు మీద ఫైనాన్షియల్ భారం పడే పరిస్థితి వచ్చింది.
ధరణిపై వచ్చిన విమర్శలు..!:
భూముల మార్కెట్ విలువలు ఆన్లైన్లో ఒక్కమాటలాగా నిర్ణయించడం వల్ల, వాస్తవ గ్రౌండ్ రియాలిటీకి విపరీతమైన రేట్లు వచ్చాయని రైతు సంఘాలు, రియల్ ఎస్టేట్ రంగం పదేపదే విమర్శించాయి. ధరణిలో తప్పులు సరిదిద్దుకోవడానికి, వివాదాలను పరిష్కరించుకోవడానికి సరైన గ్రీవెన్స్ సదుపాయం లేదన్న కారణంతో చిన్న తప్పు కోసం కూడా సివిల్ కోర్టుల వరకూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అయిన సందర్భాల్లో రీఫండ్ సదుపాయం కూడా స్పష్టంగా లేకపోవడం, కోట్ల రూపాయల ఫీజులు తిరిగి రావడం ఆలస్యం కావడం కూడా పెద్ద సమస్యగా మారింది. ధరణి అన్ని సమస్యలను అధిగమిస్తూ కొత్త చట్టం అందరికీ న్యాయం చేస్తుందని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తీసుకువచ్చింది.
భూభారతి ఏదీ? కొత్త చట్టం లక్ష్యం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి కొత్త చట్టం ప్రకారం ఆన్లైన్ పోర్టల్ తో పాటు గ్రామ స్థాయి రెవెన్యూ రికార్డులు మళ్లీ మాన్యువల్ రూపంలో కూడా మెయింటైన్ చేయాలని నిబంధనలు పెట్టారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీలు, ల్యాండ్ ట్రిబ్యునల్స్ ద్వారా వివాదాల పరిష్కారం, రైతులకు దగ్గరలోనే న్యాయం కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. భూభారతి పోర్టల్లో కూడా “వ్యూ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఫర్ స్టాంప్ డ్యూటీ ” అనే ఆప్షన్ ద్వారా జిల్లా,మండల,గ్రామం,సర్వే నంబర్ ఎంపిక చేసి ఆన్లైన్ మార్కెట్ విలువ చూడొచ్చు. భూభారతి చట్టంలో తహసిల్దార్లకు రికార్డు పరిశీలన, పొరపాట్లు సరిదిద్దడం, రిజిస్ట్రేషన్ సంబంధిత నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఇచ్చారు, కానీ అధిక విలువ ఉన్న భూముల విషయంలో మాత్రం కలెక్టర్ అనుమతి తప్పనిసరి అనే రూల్ పెట్టారు. మార్కెట్ విలువ ఒక నిర్దిష్ట పరిమితి (ఉదాహరణకు 5 లక్షల రూపాయల పైగా విలువ ఉన్న భూములు) దాటితే, కరెక్షన్లు, మార్పులు కోసం రైతు కలెక్టర్ కార్యాలయం వరకూ వెళ్లాల్సి రావడం చిన్న భూస్వాములకు భారంగా మారుతుంది.
ధరణి వర్సెస్ భూభారతి.. భూమి రేట్లతో రైతులపై ప్రభావం..!
ధరణి కాలంలో లాగే భూభారతి పోర్టల్లో కూడా మార్కెట్ విలువలు ఆన్లైన్గా ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. గ్రామ స్థితిగతులు, భూమి నాణ్యత, వ్యవసాయ ఆదాయం వంటి అంశాలు ప్రాపర్గా ప్రతిబింబించలేకపోయేసరికి రైతులపై అధిక రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం కొనసాగుతోంది. తహసీల్దార్లు నిజంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి, రైతు సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రేట్లను పునర్విచారణ చేసే విధానం యదార్ధంగా అమలులోకి రాకపోతే, భూభారతి కూడా ధరణి తరహాలోనే కేవలం కొత్త పేరుతో ఆన్లైన్ రేట్లు చూపే సిస్టమ్గా మిగిలిపోతుందనే విమర్శలకు వస్తున్నాయి. వాస్తవానికి, ఇప్పటివరకు భూమి మార్కెట్ రేట్ల విలువల్లో గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని ఏ మండలంలోనూ తహసీల్దారులు భూభారతి చట్టం ప్రకారం మార్పులు చేయలేదు. తద్వారా, తప్పుగా నమోదైన మార్కెట్ రేట్ల వల్ల నష్టపోయిన ఒక్క పేద రైతుకు కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఖిలా వరంగల్లోని వ్యవసాయ భూములు సర్వే నంబర్లు 706, 707 పక్కపక్కనే ఉన్న మెట్ట భూములు. అయితే, వాటి మార్కెట్ ధరలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. సర్వే నంబర్ 706 విలువ ₹31,50,000 కాగా, సర్వే నంబర్ 707 విలువ ₹88,20,000గా ఉంది. ఈ భారీ వ్యత్యాసం కారణంగా రైతులు అధిక రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి వస్తోంది, ఇది వారికి ఆర్థిక భారాన్ని కలిగిస్తోంది.


