పారిచోద్యం..!
వరంగల్ నగరంలో పేరుకుపోతున్న చెత్త
నామమాత్రంగా చెత్త సేకరణ…
అస్తవ్యస్తంగా పారిశుధ్యం
వీధుల్లో గుట్టలుగా చెత్త చెదారం
మురికికాల్వలు మూసుకుపోయి దుర్వాసన
పర్యవేక్షణలో బల్దియా విఫలం
కాకతీయ, వరంగల్ : స్వచ్ఛతపై ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా, వరంగల్ నగరంలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రధాన రహదారులు, గల్లీలు చెత్తాచెదారంతో నిండిపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పారిశుధ్య సిబ్బంది తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నామనే కారణంతో వీధుల శుభ్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ప్రధాన రహదారుల వెంట కూడా చెత్త గుట్టలు కనిపిస్తున్నాయి. చిన్నచిన్న గల్లీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
మురికికాల్వలు తీసే వారే కరువా?
నగరంలోని అనేక ప్రాంతాల్లో మురికికాల్వలు పూర్తిగా మూసుకుపోయాయి. ప్లాస్టిక్ కవర్లు, పానీయాల సీసాలు, కూరగాయల చెత్తతో కాల్వలు నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్ సమీపంలో చెత్త తొలగింపు పట్ల పూర్తిస్థాయి నిర్లక్ష్యం కనిపిస్తోంది. చెత్త కుండీలు నిండిపోవడంతో కుక్కలు చెత్తను తోడుతూ రోడ్లపై చెల్లాచెదురుగా పడేస్తున్నాయి. పిన్నవారి వీధి, డాల్ఫిన్ గల్లి ప్రవేశ రహదారి, గిర్మాజిపేట, ఆటోనగర్, దేశాయిపేట ప్రాంతాల్లో కూడా ఇదే దుస్థితి నెలకొంది. వర్షం పడితే ఈ చెత్త మురికినీటిగా మారి కాలనీల్లోకి చేరే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ శూన్యం
పారిశుధ్య పనులపై బల్దియా అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే పరిస్థితి ఇంత అధ్వానంగా మారడానికి కారణమని విమర్శలు వస్తున్నాయి. మురికికాల్వల శుభ్రతపై సిబ్బంది నిర్లక్ష్యాన్ని పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. శానిటేషన్ విభాగం నామమాత్రంగా చెత్త సేకరణ చేపట్టి బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని స్థానికులు అంటున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ఈ పరిస్థితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలంటే కేవలం ప్రకటనలు కాకుండా కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. అధికారులు స్పందించి పారిశుధ్య వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరుతున్నారు.


