ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి
కొత్త విధానాలతో కార్మికులకు ఇబ్బందులు
ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రసాద్
కాకతీయ, కరీంనగర్ : ఉపాధి హామీ కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రసాద్ డిమాండ్ చేశారు. 21, 22 తేదీలలో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్థానిక ముకుందలాల్ మిశ్ర భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి కార్మికులు కొత్త విధానాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఐ క్యాప్షన్ విధానం కారణంగా పనికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం అని అన్నారు. బిల్లులు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం సరైన కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర పోరాటం అవసరమని తెలిపారు. మండల కేంద్రాల్లో జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సుంకరి సంపత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి శంకర్, కనకం దుర్గాప్రసాద్, రాయికంటి శ్రీనివాస్, జిల్లా నాయకులు మిర్యాల రవి తదితరులు పాల్గొన్నారు.


