ఈద్ ముబారక్
ఖమ్మంలో ఘనంగా రంజాన్ వేడుకలు
షవ్వాల్ నెలవంకతో ఈద్ ఉత్సాహం
ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు..అలింగనం చేసుకుంటూ సందడి
ఖురాన్ పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రంజాన్ పర్వదినం ఘనంగా జరిగింది. షవ్వాల్ నెలవంక దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహం ఉప్పొంగగా, ముస్లింలు శనివారం అంగరంగ వైభవంగా పండుగను జరుపుకున్నారు. నెల రోజులపాటు పాటించిన ఉపవాస దీక్షలకు ముగింపు పలుకుతూ ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటించిన ముస్లిం సోదరులు శనివారం తెల్లవారుజామునే మసీదులకు తరలివచ్చారు. ఖమ్మం నగరంలోని గొల్లగూడెం, గాంధీచౌక్ ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక నమాజులు నిర్వహించారు. తెల్లని టోపీలు, సాంప్రదాయ దుస్తులు, అత్తరు పరిమళాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ప్రార్థనల్లో భక్తి పారవశ్యం
నిర్ణీత సమయానికి నిర్వహించిన నమాజుల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. మత పెద్దలు పవిత్ర ఖురాన్లోని సందేశాలను వివరిస్తూ సమాజానికి శాంతి, సౌహార్దత అవసరాన్ని గుర్తు చేశారు. ప్రార్థనల అనంతరం భక్తి పరవశంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు పంచుకున్నారు. ప్రార్థనల తరువాత తమ తమ ఇళ్లకు చేరుకున్న ప్రజలు బంధువులు, మిత్రులను ఆహ్వానించి సాంప్రదాయ వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు. ముఖ్యంగా సేమియా పాయసం వడ్డిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరిలోనూ పండుగ ఉత్సాహం వెల్లివిరిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రంజాన్ పర్వదినం భక్తి, ఆనందం, సోదరభావంతో నిండిన వాతావరణంలో ఘనంగా సాగింది.


