ప్రజల ప్రాణాలకు ముప్పుగా డంపింగ్ యార్డ్
డంపింగ్ యార్డ్ తొలగించే వరకు పోరాటం
హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
24 గంటల నిరాహార దీక్ష విరమణ
కాకతీయ, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష బుధవారం ఉదయం ముగిసింది. నిమ్మరసం సేవించి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే డంపింగ్ యార్డ్ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తీవ్రంగా అభ్యంతరకరమన్నారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా రద్దయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడితే సహించబోమని హెచ్చరించారు.జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యంగా ఉద్యమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇద్దరు ఎంపీలు, కాంగ్రెస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని కోరారు.ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే లక్ష మందితో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.
పదిరోజుల్లో డంపింగ్ యార్డును తొలగించాలి
పది రోజుల్లో డంపింగ్ యార్డ్ను తొలగించకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలోని 107 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు.నాపై కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో ఉరి తీయండి… కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్న డంపింగ్ యార్డును మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయొద్దు అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తాను ఉన్నంతవరకు డంపింగ్ యార్డును రానివ్వనని, అవసరమైతే ప్రాణాలనైనా పణంగా పెట్టి పోరాటం కొనసాగిస్తానన్నారు. అఖిలపక్షం కలిసి ముందుకు వస్తే తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.హుజురాబాద్ ప్రజలు, మహిళలు, యువత, వివిధ వర్గాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరాహార దీక్షను విజయవంతం చేశారు. ప్రజల మద్దతుతో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా పోరాటం మరింత ఉధృతం చేస్తామని కౌశిక్ రెడ్డి తెలిపారు.


