స్కూల్ బస్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
కాకతీయ, హనుమకొండ : పర్వతగిరి ప్రాంతంలో ఇటీవల జరిగిన పాఠశాల బస్సు ప్రమాదం నేపథ్యంలో హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు స్కూల్ బస్సుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో మంగళవారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో హనుమకొండ పరిసర ప్రాంతాల్లో స్కూల్ బస్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. డ్రైవర్లు పూర్తిస్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని, స్కూల్ బస్సుల నిర్వహణ, డ్రైవింగ్ విధానాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు తరచూ నిర్వహిస్తామని వెల్లడించారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు కూడా డ్రైవర్ల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.


