డ్రెనేజీలోనే తాగునీటి పైపులు!
కాశీబుగ్గలో మురికికాల్వ నిర్మాణం అస్తవ్యస్తం
పట్టించుకోని అధికారులు
కాకతీయ, వరంగల్: వరంగల్ మహానగరంలోని కాశీబుగ్గ ఏరియాలో డ్రెనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా చేపడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆ పనులు కూడా పూర్తిస్థాయిలో చేపట్టకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అసంపూర్తి నిర్మాణంతో వరద నీటి ముంపు సమస్య ఎలా పరిష్కారమవుతుందని ప్రశ్నిస్తున్నారు. పనులు కూడా నెమ్మదిగా చేపడుతున్నారని, మురికి కాలువలోనే మంచినీటి పైపులైన్ తేలుతుండడం వల్ల ఆందోళన చెందుతున్నారు. పైపు పగిలితే మురికి నీరు లోపలికి వెళ్లకుండా ఉంటుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అసంపూర్తి నిర్మాణంపై అసహనం..
ఈ కాలనీలో చేపడుతున్న డ్రెయినేజీ నిర్మాణం పూర్తిస్థాయిలో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ కావాలనే పనులు చేస్తున్నాడా? లేదంటే స్థానికులు ఎవరైనా అడ్డుపడుతున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులంటే ఒక్కరి కోసమో, ఇద్దరి కోసమో చేపట్టరని, ప్రజలందరి క్షేమం కోసం చేపట్టే పనులను అడ్డుకోవడం సరికాదని మండిపడుతున్నారు. అసలు డ్రెయినేజీ నిర్మాణం ఎక్కడి వరకు నిర్మించాలని ఆదేశాలు ఉన్నాయని అడిగినా కాంట్రాక్టర్ చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షించని అధికారులు!
పనులు మొదలైన నాటి నుంచి వరంగల్ మహానగర పాలక సంస్థకు చెందిన అధికారులు ఎవరూ రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు ఏస్థాయిలో జరుగుతున్నాయో కూడా పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. వర్షాలు భారీగా కురిసినప్పుడల్లా వరద నీటికి కాలనీ మొత్తం నీట మునుగుతున్న విషయం తెలిసీ కూడా డ్రెయినేజీ నిర్మాణం పకడ్బందీగా చేపట్టకపోవడం పట్ల అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పనుల తీరును పరిశీలించి, పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
ఎవరైనా అడ్డుకుంటున్నారా? కాంట్రాక్టరే నిర్లక్ష్యం చేస్తున్నారా?
అసలు ఈ పనులు పూర్తిస్థాయిలో జరగకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? లేదంటే కాంట్రాక్టరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అంటూ స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బల్దియా అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదే క్రమంలో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.


