కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. డీఆర్డీవో దీనిని అభివ్రుద్ధి చేసింది. సమీక్రుత గగనతల రక్షణ వ్యవస్థను 23వ తేదీ అర్థరాత్రి ఒడిశా తీరం నుంచి డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఐఏడీడబ్ల్యూఎస్ అనేది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. దీనిలో భారత్ లో అభివ్రుద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్, హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి.
ఐఏడిడబ్ల్యూఎస్ విజయవంతంగా అభివ్రుద్ధి చేసినందుకు డీఆర్డీవో సైనిక దళాలను నేను అభినందిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన పరీక్ష బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ సామర్ధ్యాన్ని తెలియజేసింది. శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాల రక్షణను ఇది బలోపేతం చేయనుందని ఎక్స్ లో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పోస్టు చేశారు. ఆగస్టు 15న సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను అభివ్రుద్ధి చేస్తామని ప్రధానినరేంద్ర మోదీ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ ఎయిర్ డిఫెన్స్ ను పరీక్షించడం విశేషం.
ఈ మధ్యే భారత్ మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంలో ఆ క్షిపణి అన్ని సాంకేతిక కార్యనిర్వాహక ప్రమాణాలను అందుకుని లక్ష్యాన్ని ఛేదించింది. రక్షణ పరిశోధన, అభివ్రుద్ధి సంస్థ అభివ్రుద్ధి చేస్తున్న ఈ క్షిపణి పరిధి 5వేల కిలోమీటర్ల వరకు ఉంది. ఒకేసారి మూడు అణు వార్ హెడ్స్ ను మోసుకెళ్లి ఫైర్ చేసే కెపాసిటి దీనికి ఉంది.


