ప్రసూతులపై నిర్లక్ష్యం వద్దు
గర్భిణీలు ఉచిత సేవలు వినియోగించుకోవాలి
ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో ఎమ్మెల్యే నాగరాజు
సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం
తల్లి శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ : ఆసుపత్రులకు ప్రసూతి కోసం వచ్చే మహిళల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. వైద్య సిబ్బంది మానవతా దృక్పథంతో సేవలు అందిస్తేనే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తల్లి శిశు ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు, పోషకాహారం, సమయానికి వైద్య పరీక్షలు, సురక్షిత ప్రసవం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
తల్లి శిశు సంక్షేమమే లక్ష్యం
ప్రతి కుటుంబం ఆడ మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా పెంచాలని ఎమ్మెల్యే సూచించారు. వృద్ధ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని, వారి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ బాల్య వివాహాలు తల్లి శిశు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ఆడపిల్లలకు విద్య, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజంలో లింగ వివక్షత కారణంగా జరుగుతున్న భ్రూణహత్యలను అరికట్టేందుకు గ్రామ స్థాయిలో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యకరమైన మాతృత్వానికి సూచనలు
సురక్షిత మాతృత్వానికి సరైన వయస్సు ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. గర్భిణీలు ఒత్తిడి లేకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భధారణల మధ్య విరామం అవసరమని చెప్పారు. గర్భంలో లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఆరోగ్యంపై అవగాహన పెంచడం ద్వారా మంచి అలవాట్లు ఏర్పడతాయని తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు. సి కే ఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ గర్భిణీలకు నిర్దేశిత విధంగా పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమానికి ముందు ఆసుపత్రి వార్డులను ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి సందర్శించారు. గర్భిణీలతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


