సీఎం వీధి రౌడీలా మాట్లాడుతారా..
ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే బెదిరిస్తారా ?
రేవంత్రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీలు బంద్..
పిల్లల భవిష్యత్తు గురించి సర్కార్ ఆలోచించాలి
వరంగల్లో వరద బాధితులకి వెంటనే న్యాయం చేయాలి
ఎంజీఎంను బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్టించుకోలే..
దవాఖానలో సూది ఉంటే దూదిలేదు.. దూది ఉంటే సూదిలేదు
రాజకీయాల కోసం కాదు.. సమస్యల పరిష్కారం కోసమే యాత్ర
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
వరంగల్ నగరంలో జనంబాట.. ఎంజీఎం, లైబ్రరీ సందర్శన
సమ్మయ్యనగర్లో వరద బాధిత కుటుంబాలకు ఓదార్పు
కాజీపేటలో బోనాలతో తెలంగాణ జాగృతి కార్యకర్తల ఘన స్వాగతం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫీజు రీయింబర్స్మెంట్ అడిగినందుకు సీఎం రేవంత్రెడ్డి వీధి రౌడీలాగా మాట్లాడారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం వరంగల్లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కవితకి కాజీపేట ఫాతిమా నగర్ బ్రిడ్జి దగ్గర బోనాలతో తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్కి దిగారని గుర్తుచేశారు. ఆయా కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చారని.. కానీ ప్రైవేట్ కాలేజీలకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్పై రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. రెండు రోజులపాటు వరంగల్ నగరంలో ఉండి స్థానిక సమస్యలు తెలుసుకుంటానని కవిత తెలిపారు.
వరద బాధితులకి న్యాయం చేయాలి..
వరంగల్ నగరంలోని సమ్మయ్యనగర్ కాలనీలో వరద బాధిత ప్రాంతాల్లో కవిత పర్యటించారు. ఇటీవల వర్షాలకు నష్టపోయిన వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు. వరద బాధితులకి న్యాయం చేస్తానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని.. కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం మాట అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని, వరద బాధితులకు ఇప్పటిదాక ప్రభుత్వం ఎందుకు కనీస తక్షణ సాయం చేయలేదని ప్రశ్నించారు. వరద బాధితులు ఒక్కరికీ నయా పైసా కూడా ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. వరంగల్ జిల్లా కలెక్టర్ వెంటనే బాధితులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరంగల్ నగరాన్ని వరదలు చుట్టుముట్టాయని ఆరోపించారు. ఇది ప్రకృతి విపత్తు కాదని కాంగ్రెస్ తెచ్చిన విపత్తు అని ఎద్దేవా చేశారు కవిత.
ఎంజీఎంలో వసతులు లేవు..
మరోవైపు.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కవిత పర్యటించారు. రోగుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిని గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఎంజీఎంలో రోగులకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయని తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో సూది ఉంటే దూది లేదని.. దూది ఉంటే సూది లేదని విమర్శించారు. ఎంజీఎం దవాఖానలో టెస్టులు చేసేందుకు కావాల్సిన కెమికల్స్ కూడా లేవు. దీంతో పేషెంట్లు బయట పరీక్షలు చేయించుకుంటున్న దారుణ పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళ మంత్రులు ఉన్న ప్రసూతి ఆస్పత్రి దౌర్భాగ్య స్థితిలో ఉందని ఆక్షేపించారు. రాజకీయ ఉద్దేశంతో తాను పర్యటనలు చేయడంలేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజా సమస్యల మీద తాను పోరాటం చేస్తున్నానని కవిత పేర్కొన్నారు.



