జిల్లాలను రద్దు చేయం
ఉన్న వాటిని తొలగించం..
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయం
పునర్వ్యవస్థీకరణ చేయాలంటే ప్రజలతో చర్చించే నిర్ణయం
సింగరేణి కార్మికుల వల్లే అధికారంలోకి ప్రజాప్రభుత్వం
బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర
పిట్ట కథలతో కేసీఆర్ ప్రజలను పదేళ్లు మోసం
ఏప్రిల్ తర్వాత రెండోవిడత ఇందిరమ్మ ఇల్లు
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అండగా నిలవండి
భూపాలపల్లి జిల్లాలో అన్ని సీట్లు గెలవాలి
పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి
చెల్పూర్ పరిధిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగం
బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న జిల్లాలను తొలగించేది లేదని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదని స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించారు. జిల్లాలోని గుణపురం మండలం చెల్పూర్ పరిధిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాలను రద్దు చేసే ఆలోచన తనకు లేదని కుండబద్దలు కొట్టారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలంటే ప్రజలతో చర్చించే చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు, ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంపై కొందరికి విషం చిమ్మడమే పని అని విపక్షాలను విమర్శించారు. మెడికల్ బోర్డు విషయంలో విషం చిమ్మతే ఊరుకునేది లేదని ఉద్ఘాటించారు. సింగరేణి కార్మికుల వల్లే ప్రజాప్రభుత్వం అధికారంలో ఉందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదని వెల్లడించారు. సింగరేణి కార్మికుల వల్లే ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
అభ్యర్థులు ప్రజలకు నమ్మకం కలిగించాలి
జీవిత కాలం పని చేసినా ఒక్కొక్కసారి పార్టీ టికెట్ రాదని.. అలా వస్తే అదే పెద్ద గుర్తింపు అని భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ బీ ఫారం వస్తే గెలుస్తామన్న వాతావరణం భూపాలపల్లిలో ఉందని వారికి తెలిపారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం చెల్పూర్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద భూపాలపల్లి బరిలో దిగిన అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సీఎం మాట్లాడుతూ.. టికెట్ రాని వాళ్లకు ఆవేదన ఉంటుందన్నారు. వారితో సమన్వయం చేసుకొని పోవాలంటూ అభ్యర్థులకు సూచించారు. టికెట్ కోసం పోటీపడిన వాళ్లను నిర్లక్ష్యం చేయెుద్దంటూ హితవు పలికారు.
టికెట్ రాని వాళ్లను పార్టీ వదిలేయదని.. వాళ్లకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని వివరించారు. ఓటర్లను ఒకటికి నాలుగు సార్లు కలవాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం కలిగించిన వాళ్లకే ప్రజలు ఓట్లు వేస్తారని తెలిపారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓటు అడగాల్సి ఉందన్నారు. కార్యకర్తల కోసం నాయకులు కష్టపడాల్సి ఉందని చెప్పారు. పార్టీని గెలిపించుకొని పనులు చేయించుకోవాలని అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. భూపాలపల్లిలో అన్ని సీట్లు గెలవాలంటూ అభ్యర్థులను ఆదేశించారు. పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప ఉద్యమ నేత
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందిని సీఎం పేర్కొన్నారు. దేశానికే నాయకత్వం వహించిన మాజీ ప్రధాని పీవీ ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప ఉద్యమ నేత అని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల ప్రత్యేకతను ఉద్యమంలో చూశామని వెల్లడించారు. దక్షిణ కుంభమేళాగా సమ్మక్క-సారలమ్మ జాతరను జరుపుకున్నామని సీఎం పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీఇచ్చారు. అటవీ ప్రాంతంలో రిసార్ట్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల రెండోవిడత
2004-14 మధ్య 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని ప్రశ్నించారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవితకు మాత్రం ఫామ్హౌస్లు ఇచ్చాయని విమర్శించారు. కేసీఆర్కు పేదల పట్ల ఎలాంటి పట్టింపు లేదు అని పునరుద్ఘాటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్న ఊరిలో ఓట్లన్ని బీఆర్ఎస్కు అని వారు అంటే ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊరిలో ఓట్లన్ని కాంగ్రెస్కు అని ఆనాడు చెప్పానని సీఎం పేర్కొన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్కు గంపగుత్తగా ఓట్లు వేశారని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ఇళ్లన్నీ నిర్మించుకొమ్మని అన్నారు. ఏప్రిల్ తర్వాత ఇందిరమ్మ ఇల్లు రెండోవిడత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు.
కొత్త భూభారతి చట్టంలో భూ సమస్యలు ఉండవు: మంత్రి పొంగులేటి
సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏప్రిల్లో కేబినెట్లో నిర్ణయం తీసుకొని 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తామన్నారు. అర్హులైన పేదవారికి 100 శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో చాలా చోట్ల భూములకు సరైన పత్రాలు లేవని తెలిపారు. కొత్త భూభారతి చట్టం ప్రకారం ఎటువంటి భూ సమస్య లేకుండా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మీకు సంక్షేమ పథకాలు అందజేయడం వల్లే సర్పంచ్ ఎన్నికల్లో 68 శాతానికి పైగా గెలిచారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.
అబద్ధాలు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీతో.. : ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి జిల్లా పోతుందంటూ మున్సిపల్ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ అభ్యర్థులు అబద్ధాలు చెబుతున్నారంటూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మండిపడ్డారు. అబద్ధాలు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీతో అని ఆయన ఎద్దేవా చేశారు. పాత రేషన్ కార్డులో పేర్లు ఎక్కించలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందని గుర్తు చేశారు. సింగరేణి కార్మికుల్లో సుమారు 200మంది డిస్మిసయ్యారని వారికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చేయాలని స్పష్టం చేశారు.
మహిళలను కోటీశ్వరులు చేయడమేలక్ష్యం: ఎంపీ కడియం కావ్య
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు. అలాగే భూపాలపల్లికి రైల్వే లైన్ కావాల్సి ఉందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్న వారికి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు.


