కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కొత్త పల్లి మండలం ఎలగందల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాత సహకారంతో బ్యాగులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందుతున్న సౌకర్యాలను, సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భవిష్యత్తులో రాణించి సొంత కాళ్లపై నిలబడాలని సూచించారు. పదిమందికి సాయం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎలాంటి సహకారమైనా అందిస్తామని, పట్టుదలతో చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు అందజేసిన దాత మేడి నగేష్ ను అభినందించారు.
పాఠశాలలకు పంపిణీ చేసిన గోడ గడియారాల్లో సూచించిన 12 అంశాలను తెలిపే విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ ఆనందం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ నరసింహారెడ్డి పాల్గొన్నారు.


