గుప్త నిధుల కోసం తవ్వకాలు
*అర్ధరాత్రి అడవుల్లో దుండగుల దుశ్చర్య
*సీతానగరం గ్రామ యువకుల అలజడితో పరారి
*నిర్ధారించిన ఫారెస్ట్ అధికారులు
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం శనివారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. అడవుల్లో అర్ధరాత్రి జెసిబి శబ్దాలు రావడంతో సీతానగరం గ్రామస్తులు, యువకులు అటువైపుగా వెళ్లి ఆరా తీశారు. విషయాన్ని గమనించిన దుండగులు జెసిబి తో సహా పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీతానగరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేట కోసం దుండగులు చేస్తున్న దుశ్చర్యను వ్యవసాయ పంట పొలాలకు వెళ్లే రైతులు గుర్తించి గ్రామస్తులు, యువకులకు సమాచారం అందించారు. దీంతో గుప్త నిధుల కోసం తవ్వుతున్న ప్రాంతాన్ని గ్రామస్తులంతా చుట్టుముట్టారు. విషయాన్ని ముందుగానే పసిగట్టి దుండగులు, గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించారు.
గ్రామస్తులు వస్తున్నారని సమాచారం ఎలా అందింది..?
సీతానగరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన గుర్తు తెలియని వ్యక్తులకు గ్రామస్తులు ఆ ప్రాంతానికి వస్తున్నారని సమాచారం ఎలా అందింది..? అంటే ఇందులో గ్రామస్తుల పాత్ర ఉందా..? లేదంటే గుప్త నిధులు తవ్వకాల్లో మరొకరిని సంబంధిత దుండగులు విభేదించారా…? అందుకే సమాచారం లీక్ అయ్యిందా..? అనే కోణంలో గ్రామస్తులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. తవ్వకాల కోసం తీసుకొచ్చిన జెసిబి అటవీ ప్రాంతం నుంచి అంత తొందరగా ఎలా అక్కడి నుంచి వెళ్ళిపోయిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
గుప్తనిధుల కోసమే తవ్వకాలు
గూడూరు మండలంలోని సీతానగరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా గుర్తించామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బానోత్ సురేష్ తెలిపారు. గ్రామస్తులు ఆ ప్రాంతానికి వెళ్లేసరికి గుప్త నిధులు తవ్వే గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయినట్లుగా గ్రామస్తులు తెలిపినట్లుగా సురేష్ వివరించారు.


