కేంద్ర నిధులతో అభివృద్ది
తెలంగాణకు రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు
అబద్ధపు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు
రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి
ఆరు గ్యారెంటీల్లో కనీసం ఒక్కటైనా అమలు చేశారా ?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: గత పదకొండేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయించిందని, ఈ నిజం రేవంత్ రెడ్డికి కనపడటం లేదా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఇందూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ తెలంగాణ నాయకులపై విచ్చలవిడిగా తప్పుడు ఆరోపణలు చేయడం, అబద్ధాల ప్రచారం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ, దేశాన్ని విభజించే రాజకీయాల వైపు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో అపోహలు సృష్టించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండీ అలయెన్స్లో ఉన్న పార్టీలు దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు దేశమంతా ఒక్కటే అన్న భావన ప్రజల్లో ఉందని, భారతదేశ ప్రజలంతా ఏకత్వంతో ముందుకు సాగాలని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందని రేవంత్ రెడ్డి పదేపదే ప్రశ్నిస్తున్నారని, ఇటువంటి అబద్ధపు ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏమిచ్చిందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర నిధులతోనే అభివృద్ధి
తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరుగుతోందని అన్నారు. 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, అమృత్ పథకం, స్వచ్ఛభారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల పథకం, గరీబ్ కళ్యాణ్ అన్న యోజనల ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ల రీమోడలింగ్, రోడ్లు, రోడ్-రైల్ కనెక్టివిటీ వంటి అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వమే చేపడుతోంది. పేదలకు ప్రతి నెల 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, డ్రైనేజీల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు పూర్తిగా కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమిచ్చిందో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాజెక్టులు, నిధులను కొడంగల్ నియోజకవర్గానికి మళ్లించడం కాకుండా, అసలు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కనీసం ఒక్కటైనా అమలు చేశారా..? రైతులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలకు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధించడంతో సుమారు 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడింది.
ల్యాండ్ మాఫియా, కమీషన్లు, అవినీతి, నేరాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయి. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను అడ్డుకోవడానికి బీజేపీ నాయకులను బద్నాం చేసేలా అబద్ధపు ప్రచారాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు అని రాంచందర్రావు మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ తిట్ల దండకం: గౌతంరావు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతం రావు మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనూ ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని విమర్శించారు. ఈ మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తాము ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా, తిట్ల దండకాలు, తప్పుడు హామీలు, కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు అడిగారు. 420 హామీలు చివరికి 420గా మారాయి. ఈ రోజు ప్రజలు హామీల అమలు గురించి ప్రశ్నిస్తే, ప్రతిపక్షాలపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఇదేనా హార్వర్డ్ యూనివర్సిటీలో నేర్చుకుని వచ్చిన లీడర్షిప్? అని ప్రశ్నించారు.


