ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు
కాకతీయ, మధిర : ఆశ వర్కర్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్బంధ చర్యలను ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు తెలిపారు. హామీలు అమలు చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మధిర పట్టణంలోని భగత్ సింగ్ సెంటర్ వద్ద ఆశ వర్కర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శీలం నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమం కొనసాగుతుందన్న హెచ్చరిక
చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టగా లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేయడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు సృజన, బాపట్ల లక్ష్మి, రజిని, నాగమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


