కాకతీయ, అమరావతి: పిఠాపురం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం మహిళలకు కానుక ప్రకటించారు. 10వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయాలని పవన్ నిర్ణయించారు. పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. 22వ తేదీ ఉదయం 5గంటల నుంచి ఈ ఆలయంలో వ్రతాలు ప్రారంభమవ్వనున్నాయి.
మొత్తం 5 విడతలుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్ కు ఒక్కో అమ్మవారి పేరును అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు బ్యాచ్ ల వారీగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వచ్చే ఆడపడుచులకు కూడా పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందిస్తారు. మొత్తం 10వేల మంది ఆడపడుచులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి కూపన్ల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమైంది.
కూపన్లపై సమయం ముద్రించి ఉంటుంది. ఆ సమయానుసారం వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాగా ఈ చీరలను దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు పంపిణీ చేయనున్నారు.


