ఐదు రోజుల బ్యాంకింగ్కు డిమాండ్
కొత్తగూడెంలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ
పని భారం తగ్గించాల్సిందేనని నినాదాలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో మంగళవారం బ్యాంకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. సూపర్బజార్ ప్రాంతంలో ప్రారంభమైన ర్యాలీలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంతీయ కార్యదర్శి శ్రీకాంత్, ఎస్బీఐ యూనియన్ కార్యదర్శి భవానీ శంకర్, డీసీసీబీ కార్యదర్శి వి. కృష్ణారావు, యూనియన్ బ్యాంక్ కొత్తగూడెం కార్యదర్శి శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ. శాంతి మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులపై రోజురోజుకు పెరుగుతున్న పని భారాన్ని తగ్గించడంతో పాటు పని–వ్యక్తిగత జీవన సమతుల్యత సాధించేందుకు ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అత్యవసరమని వారు స్పష్టం చేశారు. ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఖాతాదారులకు కూడా ప్రయోజనకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డిమాండ్ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణానికి చెందిన వివిధ బ్యాంకుల సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


