డబ్బులు ఇస్తేనే పట్టా పాస్బుక్..!
దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు
ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు డిమాండ్
ఏడాదిన్నరగా కార్యాలయం చుట్టూ ప్రదిక్షణ
ఆర్ఐ, సర్వేయర్ కుమ్మక్కయారంటూ రైతుల ఆరోపణలు
కూసుమంచి రెవెన్యూ కార్యాలయంపై పెరుగుతున్న విమర్శలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సొంత నియోజకవర్గంలో పరిస్థితిపై చర్చ
కాకతీయ, కూసుమంచి : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ధరణి స్థానంలో భూభారతి విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంతో తమ భూముల సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ కూసుమంచి మండలంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టా పాస్బుక్ పొందాలంటే తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాల్సిందేనని రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాదిన్నరగా పాస్బుక్ల కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సరైన స్పందన రావడం లేదని చెబుతున్నారు. పాస్బుక్ కావాలంటే ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు డబ్బులు ఇవ్వాలని మధ్యవర్తుల ద్వారా చెప్పిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత కొంతకాలానికి పాస్బుక్ వస్తుండటంతో ఈ వ్యవహారం మరింత అనుమానాలకు తావిస్తోంది.
దళారుల ద్వారా వసూళ్లు
గ్రామాల్లో ఏర్పాటు చేసిన దళారులు రైతులను సంప్రదించి పాస్బుక్ కావాలంటే నిర్దిష్టంగా డబ్బులు ఇవ్వాలని చెబుతున్నారని రైతులు అంటున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ కలిసి తమ పరిధిలోని గ్రామాల్లో దళారులను ఏర్పాటు చేసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ రైతుకు పాస్బుక్ వచ్చే అవకాశం ఉందో ముందుగానే తెలుసుకుని ఆ రైతుల వివరాలను దళారులకు అందజేస్తున్నారని చెబుతున్నారు. ఆ తర్వాత దళారులు రైతులను సంప్రదించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత కొంతకాలానికి పాస్బుక్ రావడంతో దళారుల ద్వారానే పని జరిగిందని రైతులు భావించే పరిస్థితి ఏర్పడింది. నిజానికి అర్హత ఉన్నప్పటికీ రైతులకు ఆ విషయం తెలియనీయకుండా ఈ వ్యవస్థ నడుస్తోందని చెబుతున్నారు.
రైతుల్లో పెరుగుతున్న అనుమానాలు
అదే గ్రామంలో కొందరికి పాస్బుక్ వస్తుండగా, మరికొందరికి రాకపోవడంతో రైతుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. తమకు ఎందుకు పాస్బుక్ రావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది రైతులు దళారులకు డబ్బులు ఇచ్చిన తర్వాతే పాస్బుక్ వచ్చిందని చెబుతుండటంతో ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మండల తహశీల్దార్కు సమాచారం ఉందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పై అధికారులకు తెలియకుండా ఈ వ్యవహారం జరుగుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే రైతులు ఎవరిని ఆశ్రయించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విచారణకు రైతుల డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.


