డీసీసీల ఎంపిక తుది దశకు !
ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..
మంత్రి ఉత్తమ్, పీసీసీ ఛీఫ్ మహేష్గౌడ్ కూడా..
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో నేతల భేటీ
జిల్లా కాంగ్రెస్ సారథుల ఎంపికపై కసరత్తు
త్వరలోనే తుది జాబితా ప్రకటన
పదవులు ఎవరిని వరిస్తాయోనని ఆశావహుల్లో ఉత్కంఠ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఉదయం రాజధానికి వెళ్లిన ఆయన పార్టీ పెద్దలతో సమావేశం అయ్యారు. జిల్లా.. పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన తుది కసరత్తులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి పాల్గొన్నారు. జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఇటీవల జిల్లా పర్యటనలు చేసిన ఏఐసీసీ పరిశీలకులు.. వర్గాల వారీగా ఒక్కో కమిటీకి ఆరుగురితో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వాటిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన సీఎం రేవంత్, భట్టి, మహేశ్ గౌడ్, మీనాక్షి.. తమ అభిప్రాయాలు వినిపించారు. 39 జిల్లాలతోపాటు పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆమోద ముద్ర తర్వాత ఈ నెలాఖరుకు తుది జాబితా ప్రకటించనున్నారు.
వారికి పదవులు రావు
సమర్థులను డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల నుంచి భారీ అప్లికేషన్లు వచ్చాయన్నారు. కనీసం ఐదు ఏళ్లు పార్టీలో పని చేసి ఉండాలన్న నిబంధన ఉందని, ఇవాళ అధిష్ఠానం సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు తన అభిప్రాయం తీసుకుని లిస్ట్ ఫైనల్ చేస్తుందని, సామాజికన్యాయం ప్రకారం ఎంపిక ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి డీసీసీ పదవి ఇవ్వరాదనే నియమం ఉందన్నారు. అలాంటి వారికి ఈ పదవి రాదు అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
కొత్త ఉత్సాహం
ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఏఐసీసీ పరిశీలకులు పర్యటించారు. తమ రిపోర్టులను రెడీ చేసి అధిష్టానానికి అందజేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, వివిధ సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు పేర్లతో కూడిన లిస్ట్ను ఇచ్చారు. ఏఐసీసీ పరిశీలకులు అందించిన ఈ రిపోర్టుల ఆధారంగానే డీసీసీ పదవులు ఖరారు కానున్నాయి. ఈ రిపోర్టులపై లోతైన విశ్లేషణ, చర్చ అనంతరం తుది నిర్ణయానికి రానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంస్థాగత నియామకాలు జరుగుతున్నాయి. ఈ నియామకాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఎంతో ముఖ్యమైనది. ఇది పార్టీ యంత్రాంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.


