– సవాళ్లను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం..
– విజిబుల్ పోలీసింగ్తో ప్రజల్లో భద్రతాభావం
– సైబర్ క్రైమ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం..
– మహిళల భద్రతకు కట్టుదిట్టమైన కార్యాచరణ
– కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
– కాకతీయతో స్పెషల్ ఇంటర్వ్యూ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రజల చైతన్యంతోనే నేరాలను కట్టడి చేయగలుగుతాం.. అందుకే మేం అనేక సవాళ్లను దాటుకుంటూ గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు నేరాల నివారణపై చైతన్యం కల్పిస్తున్నాం.. ప్రధానంగా విజిబుల్ పోలీసింగ్తో ప్రజల్లో భద్రతాభావం పెరుగుతోంది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీ కార్యాచరణతో నేరాలను అదుపు చేయగులుతున్నాం.. అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. కమిషనరేట్ పరిధిలో నేరాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కాకయతీ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సైబర్ క్రైమ్ నివారణపై తాము నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల వలన ప్రజల్లో అవగాహన గణనీయంగా పెరిగిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 12శాతం కేసులు తగ్గాయని, ముఖ్యంగా ఆర్థిక మోసాల కేసులు 13శాతం మేర తగ్గాయని ఆయన వివరించారు. అలాగే, డ్రగ్స్ మాఫియా, గ్యాంగ్లు, అనధికార గ్యాంబ్లింగ్పై కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ప్రశ్న: కమ్యూనిటీ పోలీసింగ్పై మీ దృష్టి ఏమిటి?
సీపీ : పోలీసులు-ప్రజల మధ్య విశ్వాస బంధం ఎంత బలంగా ఉంటే అంతగా నేరాలను అరికట్టగలుగుతాం. కాబట్టి కమ్యూనిటీ పోలీసింగ్ మా వృత్తిలో అత్యంత ముఖ్యమైన అంశం. కరీంనగర్ పట్టణ ప్రాంతాల్లో సవాళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాం. ప్రస్తుతం సైబర్ క్రైమ్, ఇతర నేరాలు పెరుగుతున్నాయి. వీటిని కేవలం అవగాహన ద్వారానే తగ్గించవచ్చు. అందుకే మా అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు నేరాల నివారణపై చైతన్యం కల్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల ముందు పోలీసులు ప్రత్యక్షంగా కనిపించేలా విధులు నిర్వహించడం వల్ల ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుంది. నేరస్తుల్లో భయం కలుగుతుంది. దీనివల్ల గణనీయంగా నేరాలను అరికట్టగలుగుతున్నాం. ప్రత్యేకంగా మహిళలపై, బహిరంగ ప్రదేశాల్లో జరిగే నేరాలను అరికట్టడం మా ప్రధాన లక్ష్యం. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా పోలీసులు మరింత సానుకూల ప్రతిష్ట సంపాదిస్తున్నారు.
ప్రశ్న : జిల్లాలో ఎక్కువగా ఎదురవుతున్న నేరాలు ఏవి? వాటిని అరికట్టడానికి డిపార్ట్మెంట్ తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
సీపీ : మునుపటి జిల్లాలో పోలిస్తే ఉదాహరణకు ములుగు జిల్లాలో నక్సల్స్ సంబంధిత కేసులు, ఉపా (యూఏపీఏ) చట్టం కింద నేరాలు ఎక్కువగా ఉండేవి. అయితే కరీంనగర్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ పట్టణ పోలీసులకు ఎదురయ్యే సవాళ్లు వేరే రకమైనవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, భూమికి సంబంధించిన వివాదాలు, అలాగే భూ కబ్జా కేసులు అధికంగా వస్తున్నాయి. ఇవే మా ప్రధాన సవాళ్లు. కొన్ని సందర్భాల్లో నిషేధించబడిన జూదం, గంజాయి కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఇలాంటి కేసులను అదుపులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అలాగే గుండెపోటు కేసులు, రోడ్డు ప్రమాదాలు, వరకట్న వేధింపులు వంటి సాధారణ నేరాలు కూడా తరచూ మా దృష్టికి వస్తున్నాయి. ఇవి ప్రజా జీవనానికి నేరుగా సంబంధించినవి కావడం వల్ల, చట్టపరమైన చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం.

ప్రశ్న: సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ప్రత్యేక యూనిట్ లేదా స్ట్రాటజీ ఏదైనా అమలు చేస్తున్నారా?
సీపీ : సైబర్ నేరాలను మొత్తం నియంత్రించడానికి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశారు. అన్ని కమిషనరేట్లలో సైబర్ క్రైమ్ విభాగం ఉంది. కరీంనగర్ కమిషనరేట్లో కూడా సైబర్ యూనిట్ సెల్ పనిచేస్తోంది. 7 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే సైబర్ నేరాలను రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ బ్యూరో విచారిస్తుంది. 7 లక్షల లోపు ఉన్న కేసులను కమిషనరేట్ పరిధిలోనే దర్యాప్తు చేస్తాం. సైబర్ నేరాల బారిన పడిన వారు టోల్ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ క్రైమ్ నివారణపై మేము నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల వలన ప్రజల్లో అవగాహన గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం 12శాతం కేసులు తగ్గాయి. ముఖ్యంగా ఆర్థిక మోసాల కేసులు 13శాతం మేర తగ్గాయి. ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది. సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే, సంబంధిత మొత్తాన్ని వెంటనే స్తంభింపజేయడం జరుగుతుంది. ఆ తరువాత బాధితులకు లోక్ అదాలత్ లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ అమలులో ఉంది.
ప్రశ్న: ట్రాఫిక్ సమస్యలు నియంత్రణలోకి తెచ్చేందుకు మీరు తీసుకుంటున్న ఇన్నోవేటివ్ స్టెప్స్ ఏమిటి?
సీపీ : కరీంనగర్ లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ జనాభా వేగంగా పెరుగుతున్నారు. కానీ రోడ్ల సామర్థ్యం పరిమితంగా ఉంది. పార్కింగ్ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. దీనికి తోడు వేగంగా నడపడం, తప్పు మార్గంలో వెళ్లడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా 750కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. అందులో 174 ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ డిటెక్షన్ కెమెరాలు ఉన్నాయి. వీటివల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలుగుతున్నాం. జూలై నుండి స్వయంచాలకంగా చలాన్లు జారీ చేయడం ప్రారంభించాం. ఫలితంగా గత రెండు నెలల్లో ఉల్లంఘనల్లో 8శాతం తగ్గుదల గమనించాం. అలాగే నలుపు ఫిల్మ్ అద్దాలను గుర్తించడానికి టింట్ మీటర్, అధిక శబ్దాన్ని గుర్తించడానికి నాయిస్ మీటర్, అలాగే అధిక వేగం నియంత్రించడానికి స్పీడ్ గన్స్ను కొనుగోలు చేశాం. వాహనాలు చట్టవిరుద్ధంగా నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. రోడ్లపై ఆక్రమణలు ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయి. అందుకే మున్సిపల్ శాఖతో కలిసి ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ చేపట్టాం. అదే విధంగా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిపి, 12 ట్రాఫిక్ జామ్ పాయింట్లు, ప్రమాద ప్రాంతాలను గుర్తించాము అక్కడ అవసరమైన చోట లైటింగ్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశాం.
ప్రశ్న : డ్రగ్స్ మాఫియా, గ్యాంగ్లు, అనధికార గ్యాంబ్లింగ్పై మీ డిపార్ట్మెంట్ తీసుకుంటున్న కఠిన చర్యలు ఏమిటి..
సీపీ : మా దగ్గర ప్రత్యేక బృందం ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓల సమాచారాన్ని బట్టి అక్కడే చర్యలు తీసుకుంటారు. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందం కూడా సమాచారం ఆధారంగా దాడులు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మాత్రమే 290కిపైగా ఇసుక మైనింగ్ కేసులు నమోదు అయ్యాయి. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న చోట్ల మేము వెంటనే దాడులు చేసి కేసులు పెడుతున్నాం. ఇక్కడ జూదం ఎక్కువగా లేదు కానీ మాకు సమాచారం అందిన వెంటనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే ఇక్కడ వలస కార్మికులు ఎక్కువగా ఉండటంతో కొందరు ఒడిశా, బీహార్ ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్నారు. ఇటీవల ఐదు సమన్వయ శోధన కార్యకలాపాలు నిర్వహించాం. గంజాయి చాక్లెట్ కేసులు కూడా బయటపడ్డాయి. ఇందుక తగ్గట్టుగానే డ్రగ్స్ వినయోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రగ్ టెస్ట్ కిట్లు తెప్పించాం. ఇవి 24 రకాల డ్రగ్స్ను యూరిన్ టెస్ట్లో గుర్తించగలవు. టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారిపై ఎన్డీపీఏస్ చట్టం సెక్షన్ 27 కింద కేసులు నమోదు చేస్తున్నాం. గత రెండు నెలలుగా ఇది కొనసాగుతుంది.
ప్రశ్న: మహిళల భద్రత కోసం ప్రత్యేక హెల్ప్లైన్లు, షీ-టీమ్లు వంటి చర్యలు ఎంతవరకు ఫలప్రదంగా పనిచేస్తున్నాయి?
సీపీ : మహళల భద్రత పై ప్రత్యేకంగా దృష్టి సారించాం..ఇందుకోసం జిల్లాలో మూడు షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇటీవల గణేష్ ఉత్సవాలలో మండపాలు ఎక్కువగా ఉండడంతో షీ టీమ్స్ కి అదనపు ఫోర్స్ను ఇచ్చాము. ఆ సందర్భంలో ఏర్పడిన ఏ సమస్యలు, సార్వత్రిక, వ్యక్తిగత ఫిర్యాదులు అన్నీ షీ టీమ్స్ హ్యాండిల్ చేశాయి. షీ టీమ్స్ కి ఒక ప్రత్యేక వాట్సప్ నంబర్ ఉంది. రెగ్యులర్ ప్రైవేట్ ఫిర్యాదులు అందుతుంటాయి. కొన్ని సార్లు బాధితులు తమ గుర్తింపును తెలియజేయకూడదని కోరుకుంటారు. అటువంటి కేసులనూ మేము సున్నితంగా, రహస్యంగా హ్యాండిల్ చేస్తున్నాం.
ప్రశ్న: మహిళల భద్రత కోసం పునరావాసం, కౌన్సెలింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయా..?
సీపీ : మాకు పూర్తి ఫంక్షనింగ్ భరోసా సెంటర్ ఉంది. ఇక్కడ సెక్స్వల్, అబ్యూస్ బాధితుల కోసం పునరావాసం, కౌన్సెలింగ్ వంటి సేవలు అందిస్తాం. ఈ రెండు సంస్థలు మహిళలపై నేరాల నివారణలో, బాధితుల పునరావాసంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ప్రశ్న : సోషల్ మీడియా వేదికల్లో పుకార్లు, నకిలీ వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని అరికట్టడానికి పోలీస్ తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
సీపీ : కరీంనగర్ కమిషనరేట్లో సోషల్ మీడియా యూనిట్ సెల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఫేక్ న్యూస్, ద్వేషపూరిత కంటెంట్, నేరాలకు సంబంధించిన సమాచారాన్ని మానిటర్ చేస్తున్నాం. అలాగే సోషల్ మీడియా వినియోగదారులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు, ముఖ్యంగా యువత. కొంతమంది నేరస్థులు సోషల్ మీడియా ద్వారా సమాచారం సేకరించి నేరాలు చేస్తారు. ద్వేషపూరిత ప్రసంగాలు, నకిలీ వార్తలు వ్యాప్తి అవ్వడం వల్ల కూడా ఫిర్యాదులు వస్తాయి. అందుకోసం మాకు ప్రత్యేక బ్రాంచ్ బృందంలో సోషల్ మీడియా యూనిట్ సెల్ ఉంది. వారు ఫేస్బుక్, ఇస్టాగ్రామ్, వాట్సప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఏదైనా వైరల్ అయిన సమాచారం వెంటనే మాకు అందుతుంది. అ సమాచారాన్ని మేము ధృవీకరిస్తాం. అది చట్టాన్ని అతిక్రమించే అవకాశం ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటాం. అది నకిలీ కంటెంట్ అయితే, పత్రికా ప్రకటన ద్వారా స్పష్టత ఇస్తాం.
ప్రశ్న: పోలీస్ సిబ్బందికి అధిక పని ఒత్తిడి ఉంటుంది. వారి సంక్షేమం కోసం మీరు తీసుకుంటున్న ప్రోగ్రామ్స్ ఏవి?
సీపీ : నేను 8 సంవత్సరాలుగా పోలీస్ వృత్తిలో పని చేస్తున్నాను. ఇది శారీరకంగా, మానసికంగా చాలా ఒత్తిడితో కూడిన పని. జీతం స్థిరంగా వస్తుందీ కానీ ఎక్కువ సమయం ప్రజల క్షేమం పైనే దృష్టి పెట్టాలి. సరైన నిద్ర ఉండదు. పండుగల సమయంలో కూడా డ్యూటీ ఉంటుంది. కుటుంబాన్ని, డ్యూటీని బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. దానివల్ల వ్యక్తిగత జీవితం ప్రభావితమవుతోంది. కానీ రీంనగర్లో పోలీసుల సంక్షేమానికి మంచి వ్యవస్థ ఉంది. ఇటీవల క్యాంటీన్, కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేశాం. వీటిని రాయితీ ధరలో ఉపయోగించి పెళ్లిల్లు, పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చు. అలాగే క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేశాం. విద్య, వైద్యం వంటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. పోలీసుల సంక్షేమం కోసం సమావేశాలు కూడా పెడుతున్నాం.
ప్రశ్న: వరుస నేరాలకు పాల్పడే వారి పైన ఎందుకు పీడీ యాక్ట్ పెట్టడం లేదు. ఇప్పటి సీపీ పరిధిలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి?
సీపీ : పీడీ యాక్ట్ చట్టానికి సంబంధించిన నేరాలపై చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకు, అలవాటుగా నేరాలు చేసే వ్యక్తులపై, అంటే ఒకే రకమైన నేరాన్ని 3 నుండి 5 సార్లు చేసే వారిపై, పీడీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ సంవత్సరం అలవాటుగా నేరాలు చేసే వ్యక్తులు తక్కువగా ఉన్నారు. అలాగే హైకోర్టు కూడా ఈ చట్టంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని చేపుతుంది. ఎవరైనా ఈ అర్హతలకు తగినట్లయితే, వారిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తాము. ఇటీవల ఇటువంటి కేసు ఒకటి నమోదు అయ్యింది.

ప్రశ్న: ఆధునిక సాంకేతికత (సీసీటీవీ, డ్రోన్లు, ఏఐ, ఫోరెన్సిక్ టెక్నాలజీ) పోలీసింగ్లో ఎలా ఉపయోగపడుతోంది?
సీపీ : నిఘా నేత్రాలు నేరాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. నేరం చేసిన వారు తప్పించుకోకుండా కదలికలపై నిఘా ఉంచవచ్చు. దీని వలన నేరస్థులను త్వరగా పట్టుకోవచ్చు. ఇక్కడ 2500 నిఘా నేత్రాలు ఉన్నాయి. అలాగే ఇతర మండలాలో కూడా మ్యాపింగ్ చేస్తున్నాం. కొత్త హాట్స్పాట్లుగా మారుతున్న ప్రాంతాల్లో కూడా కొత్త కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. దీని వలన నేరం జరిగితే ఆన్లైన్లో నే చూడవచ్చు. నిఘా నేత్రాలను వీవీఐపీ కార్యక్రమాలు, పండుగలు ఉన్నప్పుడు కూడా ఉపయోగిస్తున్నాం. అలాగే ఇక్కడ రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నాయి. ఒకటి మునిసిపాలిటీది, మరొకటి పోలీసులది. అన్నింటికీ నిఘా నేత్రాలు లింక్ చేయబడి ఉంది. కేసులను పరిష్కరించడంలో కొత్తగా విదేశీ సీక్ పద్దతి వచ్చింది, దీనికి సంబంధించిన శిక్షణ కొనసాగుతుంది.
ప్రశ్న: చట్టాలపై అవగాహన కల్పనకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..?
సీపీ : ప్రతి గ్రామానికి గ్రామ పోలీస్ అధికారి ఉంటారు. కొత్త వచ్చిన చట్టాల గురించి, ఇటీవల జరిగిన నేరాల గురించి వారు ప్రజలకు అవగహన కల్పింస్తుంటారు. అలాగే 2023 లో కొత్త చట్టం వచ్చింది దీనికి సంబందించి గత సంవత్సరం నుంచి గ్రామాల్లో పోలిసులు అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రశ్న: చివరగా ప్రజలకు ఏం సూచనలు చేస్తున్నారు..?
సీపీ: చాలా మంది సమస్య మొదట్లోనే పోలీసులను సంప్రదించడం లేదు. చివరి సమయంలో అన్ని అవకాశాలు, మార్గాలు కోల్పోయాక పోలీసులను సంప్రదిస్తున్నారు. మీ కుటుంబంలో కాని, బయట సమాజంలో కాని క్రైం జరిగితే వెంటనే పోలీసులకు తెలియపరచాలి. పోలీస్ స్టేషన్ రాలేని పరిస్థితిలో ఫోన్ ద్వారా సమాచారం అందించాలి. పోలీసులు నిత్యం అందుబాటులో ఉంటారు. ప్రజలకు సాయం చేయడంలో పోలీసులు సంతోషంగా అందుబాటులో ఉంటారు. చివరి వాఖ్యం సమస్య వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించండి.


