నాడు అవినీతి… నేడు ప్రలోభాలు!
మళ్లీ పోటీకి దిగిన సిట్టింగ్ కౌన్సిలర్లు
గత పాలక మండలిలోని కొంతమందిపై తీవ్ర ఆరోపణలు
డబుల్ బెడ్రూం ఇండ్లలో అవకతవకలు
నేడు మళ్లీ బరిలోకి దిగడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : అభివృద్ధి, సంక్షేమం పేరుతో గత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలన ఐదేళ్ల తర్వాత తీవ్ర విమర్శల మధ్య మళ్లీ ప్రజల ముందుకు వస్తోంది. కేటీఆర్ సొంత ఇలాకాగా పేరున్న సిరిసిల్లలో ఈసారి జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలుగా కాకుండా గత పాలనపై ప్రజాభిప్రాయ పరీక్షగా మారాయి. గత ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవను పక్కనపెట్టి అధికార మత్తులో వ్యవహరించారన్న ఆరోపణలు విస్తృతంగా వినిపించాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు, అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచాయి.
డబుల్ బెడ్రూం ఇండ్లలో అక్రమాలు
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల విషయంలో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడం, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు చేయడం, చివరకు అర్హులకు ఇండ్లు రాకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. సంక్షేమ పథకాలను కొందరు కౌన్సిలర్లు వ్యక్తిగత లాభాల కోసం వాడుకున్నారన్న ఆరోపణలు బీఆర్ఎస్ పాలనపై మచ్చగా నిలిచాయి. చాలా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్న అసంతృప్తి ప్రజల్లో బలంగా ఉంది. సమస్య చెప్పుకునేందుకు కౌన్సిలర్లు అందుబాటులో లేకపోవడం, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడం ప్రజలను విసిగించాయి. కొందరు ప్రజాప్రతినిధులపై భూకబ్జాలు, అక్రమ వసూళ్ల ఆరోపణలు కూడా వినిపించాయి.
ఇవన్నీ కేటీఆర్ ప్రతిష్టకు తీవ్ర నష్టం చేశాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగింది. అభివృద్ధికి మోడల్గా ఉండాల్సిన సిరిసిల్లే పాలనా వైఫల్యాలకు చిరునామాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
మళ్లీ బరిలోకి దిగడంపై చర్చ..!
ఇప్పుడు అదే సిట్టింగ్ కౌన్సిలర్లు మళ్లీ ఎన్నికల బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. గత పాలనపై సరైన సమాధానం చెప్పకుండా, చేసిన అభివృద్ధిని చూపించకుండా ఈసారి ప్రలోభాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. గత ఐదేళ్ల పాలనను ప్రజలు గుర్తు పెట్టుకుంటారా? నిర్లక్ష్యపూరిత నాయకత్వాన్ని మళ్లీ అంగీకరిస్తారా? లేక ఈసారి జవాబుదారీతనం ఉన్న ప్రతినిధులను ఎన్నుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓటు ఒక్కరోజు నిర్ణయమే అయినా దాని ప్రభావం ఐదేళ్లు ఉంటుంది. ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజలు సరైన తీర్పు ఇస్తారా అన్నదే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా నిలిచింది.


