మద్ది మేడారంలో కాంట్రాక్టర్ల జాతర!
పైపై పనులతో లక్షల రూపాయల దోపిడీ
రూ.9 లక్షల జాతర నిధులు గాలిలో కలిసినట్టేనా?
భక్తుల సౌకర్యాలపై అధికారుల నిర్లక్ష్యం
కాంట్రాక్టర్లకు అండగా కొందరు అధికారులు?
సౌకర్యాల్లేక ప్రతీ జాతరలో భక్తుల ఇబ్బందులు
స్థానికుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం
కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని *మద్ది మేడారం*లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న జాతరను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లు భక్తుల కోసమా? కాంట్రాక్టర్ల కోసమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం జాతరను తమకు లాభాల పండుగగా మార్చుకుంటున్నారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న ఈ జాతర కోసం 9 లక్షల రూపాయలకుపైగా నిధులు విడుదలైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం నామమాత్రంగానే జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి జాతర సమయం రాగానే ఇదే పరిస్థితి కొనసాగుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై మట్టి… మొరంతో పైపై పనులు
భక్తుల సౌకర్యాల పేరుతో నిధులు తెచ్చి రోడ్లపై కేవలం మట్టి, మొరం చల్లేసి పైపై పనులు చేసి డబ్బులు కాజేయడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రోడ్డు పనుల్లో ఎంత మందంతో మొరం వేయాలి, ఎలాంటి మెటీరియల్ ఉపయోగించాలి అనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, మద్ది మేడారంలో అవేమీ పాటించడం లేదని అంటున్నారు. వేసిన మట్టి, మొరం కూడా ప్రమాణాలకు అనుగుణంగా లేకుండా చల్లినట్టుగా వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. పంచాయతీరాజ్ అధికారులు, సంబంధిత శాఖల పర్యవేక్షణ పూర్తిగా కరవైందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల జాతర పేరుతో భక్తుల కోసం పనులు చేయకుండా, డబ్బులు ఎలా సంపాదించాలన్న దానిపైనే కాంట్రాక్టర్లు దృష్టి పెట్టారని, ఇందుకు కొందరు అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మక్క జాతర పేరు మీద దోపిడీ జరుగుతోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీస సదుపాయాలూ కరువు
జాతర సందర్భంగా కనీసం తాత్కాలిక ఆస్పత్రి, వైద్య సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, సురక్షిత రహదారులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అవి ఎక్కడా కనిపించడం లేదని గ్రామస్థులు అంటున్నారు. వన్వే రోడ్లు, మూసివేసిన మార్గాలు, పూర్తికాని పనుల వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, భక్తుల అవసరాల కోసం చుట్టుపక్కల రైతులు యాసంగి పంటలు కూడా వేయకుండా త్యాగం చేస్తుంటే, అధికారులు మాత్రం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. మద్ది మేడారం జాతర 1973 సంవత్సరానికి ముందే ప్రారంభమై క్రమంగా విస్తరించిందని, ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నా సౌకర్యాల విషయంలో మాత్రం ఎలాంటి శాశ్వత అభివృద్ధి జరగడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. “50 సంవత్సరాలుగా ఇక్కడ తాత్కాలిక పనుల పేరుతో నిధులు దోచుకుంటున్నారు. శాశ్వత అభివృద్ధికి ప్రణాళికే లేదు” అని స్థానికుడు మామిండ్ల మోహన్ రెడ్డి విమర్శించారు.

ప్రణాళికలేకుండా పస్తవ్యస్త పనులు
“మద్ది మేడారం జాతరలో తలాతోకా లేకుండా పనులు జరుగుతున్నాయి. భక్తులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాల్లోనే మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అది కూడా నాణ్యతలేని మట్టి, ఇసుకతో చేస్తున్నారు. అయినా అధికారులు మౌనం వహిస్తున్నారు” అని గాదే కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టెండర్ ప్రకారం నాణ్యమైన పనులు చేయించాలి, పూర్తి స్థాయి పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మద్ది మేడారం జాతర వద్ద జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు భక్తుల జాతరా? కాంట్రాక్టర్ల జాతరా? అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.



