కాకతీయ, ములుగు : రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, అసెంబ్లీలో కాళేశ్వరంపైన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి అన్నారు. సోమవారం ములుగు మండలకేంద్రంలో జాతీయ రహదారి163పై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగుకోట్ల ప్రజల హక్కులను రేవంత్ రెడ్డి కాలరాచాడని ఆమె అన్నారు.
పోరాటాలతో సాధించిన తెలంగాణ గడ్డపై ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర ప్రయోజనాల కోసం రేవంత్ ఆరాటపడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఏపీకి గోదావరి జిల్లాలను రాసి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు అయ్యాయని, అసెంబ్లీలో జరిగిందంతా తెలంగాణను బలిపెట్టి బనకచర్ల కోసం రేవంత్ ఆడిన బాగోతం తప్ప ఇంకోటి కాదని అన్నారు. కాలేశ్వరంపై సీబీఐ విచారణ అనేది ఒక పార్టీ పైన జరుగుతున్న దాడి కాదు మొత్తంగా తెలంగాణను ఏడారిగా మార్చే విద్రోహ చర్య భావిస్తున్నామని, ఒక వైపు రేవంత్ మరోవైపు బాబు ఇంకోవైపు మోడీ ముగ్గురు కలిసి తెలంగాణను శాశ్వతంగా దెబ్బతీసే దుర్మార్గమైన కుట్రలు తెరతీశారని ఆరోపించారు.
తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం ప్రాజెక్టును బలి చేసేందుకు బాబు తెరపైకి తెచ్చిన బనకచర్ల తోనే ఈ మొత్తం కుట్రలకు బీజం పడిందన్నారు. ఒకవైపు బనకచర్ల ముప్పుతో పాటు ఇచ్చంపల్లిని తెరపైకి తెచ్చి మొత్తంగా మేడిగడ్డను ముంచే కుతంత్రం చేస్తున్నారని, తెలంగాణ రైతుకు మరణ శాసనం రాయాలన్నది ముగ్గురు కలిసి ఆడుతున్న పన్నాగమని ఆమె అన్నారు.
కాలేశ్వరం కమిషన్ నుంచి సిబిఐ విచారణ దాకా ప్రతి దాని వెనక మోడీ, చంద్రబాబు, రేవంత్ హస్తం ఉందని, ప్రియాంకగాంధీ సిబిఐ, ఈడీలను ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి వారిని వేధిచడానికి మోడీ వాడుకుంటున్నారని నిలదీయలేదా అని ప్రశ్నించారు. అప్పుడు సిబిఐ తప్పు అయినప్పుడు ఇప్పుడు ఒప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని కోర్టులో నిలబడి గోష్ నివేదిక బూచీగా చూపెట్టి బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తే పార్టీ శ్రేణులే కాదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


