కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు
అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఉద్యోగులు, కార్మికులకు నెరవేరని హామీలు..
రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం లేదు
మొక్కజొన్న రైతులకు భారీ నష్టం
మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హనుమకొండ : హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. హనుమకొండ జిల్లా బాలసముద్రం లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 420 హామీలు, 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలును పూర్తిగా విస్మరించిందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు వంటి అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో అంగన్వాడీ, ఆశా వర్కర్ల జీతాలను గణనీయంగా పెంచారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తే అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
ఉద్యోగులు.. కార్మికులకు సమస్యలే
రాష్ట్రంలో 300 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆర్టీసీ లాభాల్లో ఉందని చెప్పినా ఉద్యోగులకు జీతాలు, బెనిఫిట్లు ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ రంగాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ ప్రభుత్వం 26 వేల మంది ఆర్టిజన్లను పర్మినెంట్ చేసి జీతాలు పెంచిందని తెలిపారు. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. గుండ్లసింగారం గ్రామానికి చెందిన ఆర్టిజన్ పున్నం చందర్ ప్రమాదంలో మరణించగా, అతని కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేటను డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే ఇవ్వాలని కోరారు.
రైతుల సమస్యలపై ఆందోళన
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ మొక్కజొన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున సాగు జరిగినా ప్రభుత్వ కొనుగోళ్లు చాలా తక్కువగా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం క్వింటాల్కు 2400 మద్దతు ధర ప్రకటించినా రైతులకు కేవలం 1400–1500 మాత్రమే లభిస్తోందని, ప్రతి క్వింటాల్కు రైతులు 1000 వరకు నష్టపోతున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాల్లో సాగు జరిగినా కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రణాళికలేమి, నిల్వ సదుపాయాల లోపం ఉందని ఆరోపించారు. త్వరలో వరిసాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా సరైన ప్రణాళికలు లేవని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్ఎండీ డ్యాం పరిస్థితులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


