కొమ్మాల జాతరకు కాంగ్రెస్ ప్రభ బండ్లు
ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, ఎంపీ బలరాం నాయక్
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సందడి
కాకతీయ, నర్సంపేట టౌన్ : గీసుకొండ మండలం కొమ్మాలలో జరిగే శ్రీలక్ష్మీ నరసింహస్వామి జాతరను పురస్కరించుకొని నర్సంపేట నియోజకవర్గం నుండి వందలాదిగా కదిలిన కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ ఘనంగా ప్రారంభించారు. భాజాభజంత్రీల నడుమ, కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతూ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రభ బండ్లు జాతర వైపు ప్రయాణమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ… హోలీ పర్వదినం నాటి నుండి ప్రారంభమయ్యే కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు నర్సంపేట నియోజకవర్గంతో పాటు వరంగల్ జిల్లాలో ప్రభ బండ్లు కట్టే ఆనవాయితీ అనాదిగా కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గంలోని వందలాది గ్రామాల నుండి ప్రభలు కట్టి భక్తిశ్రద్ధలతో జాతరలో పాల్గొనడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

లక్ష్మీనరసింహస్వామి మహిమ అపారమని, ఆయన కరుణాకటాక్షాలతో నర్సంపేట నియోజకవర్గం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సమర్థంగా అందుతున్నాయని, మరింతగా ప్రజల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల నుండి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నృత్యాలు చేస్తూ, పార్టీ గీతాలు పాడుతూ జాతర వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. భక్తి, రాజకీయ ఉత్సాహం కలిసిన ఈ ప్రభ బండ్ల యాత్ర నర్సంపేట ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


