- ప్రతి మహిళకు బాకీపడ్డ రూ. 44 వేలిచ్చి ఓట్లు అడగాలి
- తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు
- అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసిండ్రు
- గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంక బిందెలకు వేట పట్టిండు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ. 75 వేల రైతుబంధు బాకీ పడిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంకె బిందెలకు వేటపట్టిండు అని సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
అన్నీ ఎగొట్టుడే..
రైతుబంధు ఇప్పుడైతే రూ. 10, 000.. మేము వస్తే రూ. 15000 ఇస్తామన్నారు. పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు. యాసంగిలో మూడెకరాల వారికి ఇచ్చిండు మిగతా వాళ్లందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని రూ. 12,000 ఇచ్చిండు. మిగతా మూడు వేలు ఎగ్గొట్టిండు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ. 75 వేల రైతుబంధు బాకీ పడింది. రైతుబంధు రైతుకి ఇస్తాం. కౌలు రైతుకి ఇస్తామన్నారు. ఒక రూపాయి అయినా కౌలు రైతుకు ఇచ్చారా? అని షరీష్ ప్రశ్నించారు. పెద్ద రైతులకు మాత్రమే కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నాడని అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు. 25 ఎకరాలు కలిగినవాళ్లు మూడు శాతం మాత్రమే ఉన్నారు. 97 శాతం మంది రైతులు 10 ఎకరాలలోపే ఉన్నారు. కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ చేసింది కరెక్ట్ అని రేవంత్ రెడ్డికి అర్థమైంది అని హరీశ్రావు అన్నారు.
గ్యారంటీలకు చట్టబద్ధత లేదు
రూ.200 ఉన్న పెన్షన్ని కేసీఆర్ 2000 చేసిండు. కాంగ్రెస్ 4000 పెన్షన్ ఇస్తా అన్నది ఈరోజు వరకు లేదు. అత్తకు, కోడలు ఇద్దరికీ ఇస్తామన్నారు. ఇంటికొక మహిళకు రేవంత్ రెడ్డి రూ. 44 వేల బాకీ పడిండు. రూ. 44000 ఇచ్చినంకనే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటు అడగాలి. రేవంత్ రెడ్డి సంతకం, భట్టి విక్రమార్క సంతకం పెట్టి గ్యారంటీ పేపర్లు పంచిర్రు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. మొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు 30 క్యాబినెట్లైనా ఊసే లేదు అని హరీశ్రావు ధ్వజమెత్తారు. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి కింద రూ. 2,500 ఇస్తామన్నారు. మాట్లాడితే మహిళలను కోటీశ్వరులని చేస్తామంటారు. ఎవరైనా అయ్యారా? ఈ బాకీ కార్డు లోకల్ బాడీ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం. ఇది కాంగ్రెస్ పాలిట ఉరితాడు అవుతుంది అని హరీశ్రావు తెలిపారు.
ఊరుకో మద్యం దుకాణం పెడతాడట
యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరుకో మద్యం దుకాణం పెడతాడట. మొత్తానికి తాగుబోతుల తెలంగాణ చేస్తా అంటున్నడు రేవంత్ రెడ్డి. తులం బంగారం ఏమైంది రేవంత్ రెడ్డి? కనీసం కల్యాణ లక్ష్మి చెక్కుల పైసలు ఇస్తలేవు. విద్యార్థులకు 5 లక్షల భరోసా ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ 9 ఏళ్లలో రూ. 20వేల కోట్ల డబ్బు చెల్లించాడు కేసీఆర్. విద్యార్థులను నిర్లక్ష్యం చేసి ఒక రూపాయి ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రెండేళ్లలో ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు అని హరీశ్రావు దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోవడంతో దావఖానాలో సేవలు బంద్ అయ్యాయని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ అని లేని సిటీకి ఆరు లైన్ల రోడ్ వేస్తాడట. ఉన్న రోడ్లను మాత్రం పట్టించుకోరంట. ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడానికి, బీహార్ ఎన్నికలకు పంపడానికి పైసలు ఉన్నాయి గానీ.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదారి నీళ్లు కాళేశ్వరం ద్వారా కాలువల్లో పారుతుంటే కళ్ళుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ప్రజలను ఇంత దగా చేస్తుందని, ఇంత మోసం చేస్తుందని ప్రజలకు వివరించాలి అని హరీశ్రావు చెప్పారు.


