- ఆ పార్టీవారే కోర్టుల్లో కేసులు వేసిండ్రు..
- పిటిషన్ వెనక్కి తీసుకుకోకుంటే తిరుగుబాటు తప్పదు
- తరువాత పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
కాకతీయ, నేషనల్ డెస్క్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఢిల్లీలోని సుప్రీం కోర్టు ఆవరణలో మల్లన్న మీడియాతో మాట్లాడారు. రెడ్డి ముఖ్యమంత్రి జీవో ఇస్తడు, రెడ్డి మనిషి పిటిషన్ వేస్తడు, రెడ్డి ప్లీడర్ కేసు వాదిస్తడు… మా బీసీలను పిచ్చోళ్లను చేస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టు చుట్టూ చూసేలా చేసి మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నరంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ చీకట్లో గొంగడి కప్పుకొని చాటుగా రిజర్వేషన్ ఇవ్వొచ్చా లేదా అని చూస్తుందన్నారు. బీసీలకు హక్కుగా రావాల్సిన రిజర్వేషన్ దక్కాల్సిందే అన్నారు. రిజర్వేషన్ ను కచ్చితంగా అడ్డుకోవాలని హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేశారని, పిటిషన్ వెనక్కు తీసుకోవాలని బీసీ సమాజం తరుపున వారికి రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా మేము పిటిషన్ వాపస్ తీసుకోకుండా ఇలాగే మొండికేస్తాం అంటే మాత్రం రాష్ట్రంలో సరికొత్త ఉద్యమం పుడుతుందని, తిరుగుబాటుగా మారుతుందని, తరువాత జరిగే పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మల్లన్న హెచ్చరించారు.
సీఎం రాజీనామా చేయాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండాపోతే దానికి పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. మల్లన్న వెంట టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, నాయకులు శ్రీశైలం తదితరులున్నారు.


