భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై నిర్లక్ష్యం
రూ.560 కోట్లతో విడతల వారీగా అభివృద్ధి పనులు
రాయల నాగేశ్వరరావు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్
కాకతీయ , కూసుమంచి : భద్రాద్రి ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. నేలకొండపల్లి మండలంలో గురువారం ఆయన పర్యటించారు. కొరట్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భద్రాచలంలో రామదాసు ఎన్నో కష్టాలు పడి రామాలయం నిర్మించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ప్రజల కోరిక మేరకు 560 కోట్లతో విడతల వారీగా అభివృద్ధి చేపడుతున్నారని చెప్పారు.
బీఆర్ఎస్పై విమర్శలు
కేటీఆర్, కవిత ఖమ్మం వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా చేయని పనులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య రంగాల్లో జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవిందరావు, నెల్లూరి భద్రయ్య, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నేలకొండపల్లి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యడవల్లి నాగరాజు, సర్పంచ్లు బోయిన వేణు, దుడ్డేల పవన్, కాంగ్రెస్ నాయకులు నంబూరి రామారావు, కొత్తపల్లి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


