ములుగులో కాంగ్రెస్ దూకుడు..!
ఇప్పటికే 5 వార్డుల్లో కాంగ్రెస్ విజయం
2 వార్డుల్లో బీఆర్ఎస్ ఖాతా ఓపెన్
భారీ మెజార్టీలతో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం వార్డుల ఫలితాలు దశలవారీగా వెలువడుతున్న క్రమంలో ఇప్పటికే ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి ముందంజలో నిలిచారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రెండు వార్డుల్లో గెలుపొందుతూ తమ ఖాతాను తెరిచింది. ప్రారంభ దశలోనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపడంతో ములుగు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
భారీ మెజార్టీలతో కాంగ్రెస్ జోరు
మొదటి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మా 288 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇదే విధంగా మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వసంత 212 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నాలుగో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పావని 367 ఓట్ల మెజార్టీతో స్పష్టమైన విజయాన్ని నమోదు చేశారు. ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ కేవలం ఆరు ఓట్ల తేడాతో ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలు నమోదు చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇంకా మిగిలిన వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉండగా, మొత్తం ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ములుగులో బలమైన స్థితిలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


