సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కరణ
కాకతీయ, కరీంనగర్ : సంచార, అర్థసంచార, విముక్త జాతుల ఆర్థిక–సామాజిక స్థితిగతులపై నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా రూపొందించిన పుస్తకాన్ని కరీంనగర్ మేయర్ కోలగని శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే తొలి ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంచార జాతుల జీవన పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకం ద్వారా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, విశ్వవిద్యాలయాలకు, పరిశోధకులకు, సివిల్స్కు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగకరమైన సమాచారం అందుతుందని చెప్పారు. సామాజిక సమరసతా వేదిక ప్రతినిధులు వివరించిన ప్రకారం అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 31 వరకు తెలంగాణలోని 29 జిల్లాల్లో 33 సంచార తెగలకు చెందిన కుటుంబాలపై సర్వే నిర్వహించారు. 70 మందికి పైగా కార్యకర్తలు 1450 కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకుని, సుమారు 7 వేల మందికిపైగా సభ్యుల వివరాలను సేకరించారు. కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షుడు తుమ్మల రమేష్ రెడ్డి, తెలంగాణ ప్రాంత కార్యదర్శి పుల్లూరి రామారావు, బోయిని పురుషోత్తం, కనికరం లక్ష్మణ్, ఉండేటి శ్రీకాంత్, దావు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


