- రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం అవ్వండి
- పెట్టుబడులతో రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోండి
- ‘ఇండియన్’ సీఈవోలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
- ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రత్యేక భేటీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని పలు కంపెనీల ‘ఇండియన్’ సీఈవోలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోవాలని కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా శనివారం సిడ్నీలో ‘ది సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా – ఇండియా రిలేషన్స్’ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ కాంక్లేవ్ లో వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో “తెలంగాణ” ముందు వరుసలో ఉందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తక్కువ సమయంలో పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కారణంగా రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానంగా మారిందన్నారు.
రండి.. ! ప్రభుత్వం తరుపున మద్దతిస్తాం..

తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూలించే అంశాలు, పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల విధానాలు, ఎకో సిస్టం, సింగిల్ విండో అనుమతుల వ్యవస్థ తదితర అంశాలపై మంత్రి శ్రీధర్బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ‘ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్’ ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటున్న చొరవను వివరించారు. ఏఐ, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఈవీల తయారీ తదితర రంగాల్లో తెలంగాణ లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు పెట్టబడుదారులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘ది సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా – ఇండియా రిలేషన్స్’ ఛైర్ పర్సన్ స్వాతి దవే, ‘ఆస్ట్రేలియా – ఇండియా’ బిజినెస్ కౌన్సిల్ నేషనల్ అసోసియేట్ ఛైర్మన్ ఇర్ఫాన్ మాలిక్, ఈటీపీఎల్ డైరెక్టర్ సౌరవ్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.


