జూలపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
సేవల్లో నాణ్యత పెంచాలని ఆదేశాలు
కాకతీయ పెద్దపల్లి/జూలపల్లి : ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జూలపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మండలంలోని తేలుకుంట గ్రామంలోని కేజీబీవీ పాఠశాల, కళాశాల, పెద్దాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్, జూలపల్లి తహసిల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కేజీబీవీలో విద్యార్థినులతో మాట్లాడి బోధన, భోజన నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవని విద్యార్థినులు తెలిపారు.
పెద్దాపూర్ మోడల్ స్కూల్లో వంటశాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, విద్యార్థులకు పోషకాహారం అందించాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచి విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.
జూలపల్లి తహసిల్దార్ కార్యాలయంలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూ భారతి దరఖాస్తులను సమయానికి డిస్పోజ్ చేయాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు సేవల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ సేవలను పరిశీలించిన కలెక్టర్, వైద్యులు సమయపాలన పాటిస్తూ ఓపీ సమయంలో తప్పనిసరిగా హాజరై ఉండాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


