డబ్బులిస్తేనే లోడింగ్
మహదేవ్పూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీలో వసూళ్లు
లారీల ఓనర్ల నుంచి రూ.3500 అక్రమంగా డిమాండ్
డబ్బులివ్వని లారీలను పక్కన పెట్టిన నిర్వాహాకులు
టీజీఎండీసీ డీడీకి అదనంగా చెల్లింపులకు హుకుం
ఇటీవల టీజీఎండీసీ అధికారుల ఆదేశాలు బేఖాతార్
భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతున్న అక్రమాలు
కలెక్టర్ దృష్టి పెట్టాలని కోరుతున్న లారీల ఓనర్లు
లేదంటే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని బాధితుల ఆవేదన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.1650 నుంచి ఒక్కో లారీకి రూ.3500 వరకు డిమాండ్ చేస్తున్నట్లు వాపోతున్నారు. డబ్బులు చెల్లించని వాహనాలను పక్కన పెట్టి లోడింగ్ చేయకుండా నిలిపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో రోజువారీ ఆదాయం మీద ఆధారపడే లారీ డ్రైవర్లు, యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు గంటల తరబడి వేచి చూసినా లోడింగ్ జరగకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇటీవల టీజీఎండీసీ అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, క్వారీ నిర్వాహకులు వాటిని పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు. డీడీ చెల్లింపులు చేసిన తర్వాత కూడా అదనంగా డబ్బులు వసూలు చేయడం వెనుక ఉన్న అసలు కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెరుగుతున్న అక్రమాలు… ఆందోళన హెచ్చరిక
భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి అక్రమాలు విస్తరిస్తున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ దందాపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. అధికార యంత్రాంగం తక్షణం స్పందించి పారదర్శకంగా ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇసుక లోడింగ్ కోసం అదనపు డబ్బులు వసూలు చేయడం పూర్తిగా అన్యాయమని లారీ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీజీఎండీసీకి డీడీ చెల్లించినప్పటికీ మరోసారి డబ్బులు అడగడం దందాగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


