సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్ద సీఎం పర్యటన..
దేవాదులపై కీలక సమీక్ష….
కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం (తుపాకులగూడెం)లో ఆదివారం సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్దకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకుని అధికారులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పి.ఓ. చిత్ర మిశ్రాలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ సందర్శన
అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ను సందర్శించి ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష చేపట్టారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్ట్ స్థితిగతులు, పెండింగ్ పనులు, భూ సేకరణ అంశాలపై వివరాలు సమర్పించారు.

సీఎం కీలక ఆదేశాలు……
సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూన్ 2లోపు భూసేకరణకు రూ.600 కోట్లు మంజూరు చేస్తామని, ప్రాజెక్ట్ అంచనాలను సమగ్రంగా సిద్ధం చేసి బడ్జెట్లో ప్రభుత్వ ఆమోదం తీసుకోవాలని, మార్చి నెలలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలిపే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నెలలోపే దేవాదుల పంప్ రిపేర్ పూర్తి చేయాలని, అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి దేవాదులపై ప్రత్యేక సమావేశం నిర్వహించి
అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, రైతులకు గ్రీన్ ఛానల్ ద్వారా పరిహారం నిధుల మంజూరు చేస్తామని, భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్ట్ పనులు ఆగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
రామప్ప–జంపన్న వాగు నీటి ప్రణాళికపై నివేదిక….
రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరు అందించే ప్రణాళికపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రణాళిక అమలైతే ప్రాంతీయ రైతులకు సాగునీటి లభ్యత పెరుగుతుందని అధికారులు తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్ పనుల వేగవంతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణ, పంపుల మరమ్మతులు, నిధుల విడుదల అంశాల్లో స్పష్టమైన టైమ్లైన్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ పనులకు ఊపొచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.


