- జిల్లా కలెక్టర్ రాజర్షి షా
కాకతీయ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, రైస్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సి.ఎం.ఆర్ సరఫరా పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్నబియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సివిల్ సప్లై కమిషనర్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మిల్లర్లు సి.ఎం.ఆర్ సరఫరా చేయకపోతే ఆర్ఆర్ చట్టం కింద చర్యలు తప్పవని హెచ్చరించారు.
2023–24 సీజన్కు సంబంధించిన మిగిలిన నాన్ అకౌంటెడ్ మిల్లర్ల వద్ద ఉన్న సన్న బియ్యాన్ని తక్షణం సరఫరా చేయాలని ఆదేశించారు. డిసెంబర్ చివరి నాటికి వందశాతం సి.ఎం.ఆర్ సరఫరా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి వారం మిల్లర్లు తమ సరఫరా పురోగతిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నివేదికలు సమర్పించాలనీ ఆదేశించారు. మిల్లర్లు సక్రమంగా సన్నబియ్యం మిల్లింగ్ చేసి, సమయానికి సివిల్ సప్లై గోదాములకు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా సివిల్ సప్లై అధికారి నందిని, డీఎం సుధారాణి, అధికారులు, రైస్ మిల్లర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.


