18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి
19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు శ్రీకారం
ఎర్పాట్లపై హై అలర్ట్
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో, అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
బుధవారం మేడారం హరిత హోటల్లో మంత్రి సీతక్క అధ్యక్షతన జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రోటోకాల్, భద్రత, వసతి, రవాణా, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.
జిల్లాకు గర్వకారణంగా మారాలి
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మేడారానికి చేరుకున్న అనంతరం అక్కడే బస చేయనున్నారని తెలిపారు. 19వ తేదీన శ్రీ సమ్మక్క–సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనులకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు వెల్లడించారు. 18వ తేదీన రాష్ట్ర స్థాయి యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉండనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాకు గర్వకారణంగా మలచాలని అధికారులను కోరారు.
18వ తేదీ ఆదివారం కావడం, పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ముగియడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ దృష్టితో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మేడారం అభివృద్ధి పనుల్లో సహకరిస్తున్న జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రోటోకాల్, బందోబస్తు, వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. హెలిప్యాడ్ నిర్వహణ పనులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించినట్లు చెప్పారు. మేడారం జాతరతో పాటు గద్దెల ప్రాంగణ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి, వీఐపీ ప్రోటోకాల్ బాధ్యతలను ఆర్డీఓ వెంకటేష్కు అప్పగించినట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా ధింసా, కోయ, గుస్సాడి, కొమ్ము కోయ వంటి సంప్రదాయ సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి భద్రత, రూట్ మ్యాప్, పార్కింగ్, గార్డ్ ఆఫ్ ఆనర్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ పర్యవేక్షించనున్నారని తెలిపారు. పోలీసు శాఖ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి, భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొని తమ శాఖల ద్వారా చేయాల్సిన ఏర్పాట్లపై నివేదికలు సమర్పించారు.


