కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు మాస్టర్ ప్లాన్ వివరాలను సీఎం ముందుంచగా, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
మేడారం మహాజాతర నాటికి ఆలయ ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు సక్రమంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చూడాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలుపుదలకు చెక్డ్యామ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించండి అని అధికారులకు సూచించారు. మేడారం అభివృద్ధి పనులు వచ్చే 100 రోజుల్లో పూర్తయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ వారం మేడారంకు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని కూడా ప్రకటించారు.
బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలపై కూడా సీఎం పలు సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులలో స్థానిక సెంటిమెంట్ను గౌరవించడం, అలాగే స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఆధునిక వసతులు కల్పించాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎంవారి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్తో పాటు పలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


