అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం
– కోట్ల రూపాయలు వసూలు చేసిన పత్తిపాక వాసి
– కేసును చేదించిన శాయంపేట పోలీసులు
– సిఐ, ఎస్సై లను అభినందించింన పరకాల ఏసీపీ సతీష్ బాబు
కాకతీయ, శాయంపేట: చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసి అమాయక ప్రజలను మోసం చేసిన వ్యక్తిని శాయంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పరకాల ఏసీపీ సి.సతీష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల కిషోర్ ప్రభుత్వ అనుమతి లేకుండా “పెరుమాండ్ల చిట్” పేరుతో చిట్టీలు నిర్వహిస్తూ 117 మంది వద్ద నుంచి రూ.1.49 కోట్లు, అలాగే అధిక వడ్డీ ఆశ చూపుతూ మరో 59 మంది వద్ద నుంచి రూ.3.55 కోట్లు తీసుకుని మొత్తం 176 మందిని మోసం చేసినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుల మేరకు శాయంపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మోసం చేసిన డబ్బుతో కొనుగోలు చేసిన హనుమకొండ గోపాలపూర్ లోని ఇల్లు, వివిధ ప్రాంతాల్లోని 12 ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పట్టా పాస్ బుక్ లు, బంగారు, వెండి ఆభరణాలు, రూ.25.39 లక్షల నగదు, క్రెటా కారు సహా సుమారు రూ.8.12 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేని చిట్స్ లో చేరకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక లాభాలు అంటూ చెప్పే పథకాలపై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు. కేసును వేగంగా ఛేదించిన శాయంపేట సీఐ రంజిత్ రావు, ఎస్ఐ పరమేశ్వర్ మరియు పోలీసు సిబ్బందిని అభినందించారు.


