మారిన ప్రాధాన్యాలు..మారనున్న రాజకీయం
2020తో పోలిస్తే 2026లో రిజర్వేషన్ల కేటాయింపుల్లో మార్పు
కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల్లో కొత్త సమీకరణాలు
బీసీలకు పెరిగిన ప్రాధాన్యం.. పెరగనున్న ప్రాతినిధ్యం
మహిళా రిజర్వేషన్తో ‘డమ్మీ’ రాజకీయంపై మళ్లీ చర్చ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ముందే విడుదలైన తాజా రిజర్వేషన్ నోటిఫికేషన్ స్థానిక రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. 2020 ఎన్నికల సమయంలో అమలులో ఉన్న రిజర్వేషన్లతో పోలిస్తే 2026 నాటికి చోటుచేసుకున్న మార్పులు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఎవరికీ లాభం కలిగింది? ఎవరి ఆశలపై నీళ్లు చల్లాయి? అన్న అంశంపై అన్ని పార్టీల్లో తీవ్ర చర్చ సాగుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో డివిజన్ల వారీగా మారిన రిజర్వేషన్లు ఇప్పటికే ఉన్న నేతల రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారాయి. గత ఎన్నికల్లో పట్టు సాధించిన కొందరు నేతలు ఈసారి రేస్కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడగా, కొత్త వర్గాలకు అవకాశం వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కార్పొరేషన్లో పెరగనున్న బీసీ ప్రాతినిధ్యం
కరీంనగర్ నగరపాలక సంస్థలో తాజా రిజర్వేషన్ నోటిఫికేషన్ రాజకీయ లెక్కలను పూర్తిగా మార్చింది. 2020లో మొత్తం 60 వార్డుల్లో ఎస్టీకి 1, ఎస్సీకి 3, ఎస్సీ మహిళలకు 3 కలిపి మొత్తం 6 సీట్లు ఉండగా, బీసీలకు 23 వార్డులు కేటాయించారు. జనరల్ మహిళలకు 16, అన్రిజర్వ్డ్కు 14 సీట్లు ఉండటంతో మహిళా రిజర్వేషన్ మొత్తం 30కి చేరింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కార్పొరేషన్లో వార్డుల సంఖ్య 66కు పెరిగింది. ఇందులో బీసీలకు 25 సీట్లు కేటాయించడంతో ఈ వర్గానికి మరింత రాజకీయ బలం చేకూరింది. ఎస్సీలకు మొత్తం 7 సీట్లు దక్కగా, ఎస్టీలకు మాత్రం మళ్లీ ఒక్క వార్డే కొనసాగింది. జనరల్ మహిళలకు 18, అన్రిజర్వ్డ్కు 15 సీట్లు ఉన్నాయి. 2020తో పోలిస్తే బీసీలకు స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుండగా, ఎస్సీలకు స్వల్ప లాభమే దక్కిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మున్సిపాలిటీల్లోనూ అదే సరళి
కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను బీసీలకు 8, ఎస్సీలకు 6, ఎస్టీలకు ఒక్క వార్డు మాత్రమే కేటాయించారు. జమ్మికుంటలోనూ బీసీలకే ఆధిక్యం కొనసాగుతోంది. చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డుల్లో బీసీలకు 3, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 సీటే లభించింది. మొత్తంగా చూస్తే మూడు మున్సిపాలిటీల్లోనూ బీసీలకే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, ఎస్టీలు ప్రతీకాత్మక స్థాయికే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీలు మాత్రం మధ్యస్థ స్థాయిలోనే నిలిచిపోయారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
రిజర్వేషన్ల పెంపుతో మహిళలకు ప్లస్..!
మహిళా రిజర్వేషన్ సంఖ్య పెరిగినప్పటికీ, ఆ సీట్లలో డమ్మీ అభ్యర్థుల రాజకీయానికి మళ్లీ అవకాశం ఉందన్న చర్చ తెరపైకి వచ్చింది. కాగితాలపై మహిళలకు అధిక ప్రాతినిధ్యం కనిపిస్తున్నా, వాస్తవంగా రాజకీయ నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అంశం టికెట్ల పంపకంలో పార్టీలకు పెద్ద సవాలుగా మారనుంది. రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల సంఖ్య పెరిగింది. ఒకే డివిజన్పై పలువురు పోటీ పడుతుండటంతో పార్టీల అధిష్టానాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. మొత్తంగా 2026 మున్సిపల్ ఎన్నికల్లో వ్యక్తుల కంటే రిజర్వేషన్ పటమే కీలకంగా మారిందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. సామాజిక న్యాయం లక్ష్యమా? లేక రాజకీయ గణితమే ప్రధానమా? అన్న ప్రశ్నలతో కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకూ మరింత వేడెక్కుతోంది.


