సీసీఐ స్లాట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు
రైతుకు గరిష్టంగా 5 క్వింటాళ్ల అదనపు పత్తి విక్రయానికి అనుమతి
కాకతీయ, కరీంనగర్ : పత్తి రైతులకు భారత పత్తి సంస్థ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – సీసీఐ) కీలక సమాచారం అందించింది. ‘కాపాస్ కిసాన్ యాప్’ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తి విక్రయించే విధానంలో సీసీఐ నిబంధనలను సవరించింది. డిసెంబర్ 25 అర్థరాత్రి 12.00:01 గంటల నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, యాప్లో నమోదు చేసిన పత్తి పరిమాణానికి అదనంగా రైతులు గరిష్టంగా 5 క్వింటాళ్ల పత్తిని మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉంటుంది. దీనికి మించి ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయబోదని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల రైతులు స్లాట్ బుకింగ్ సమయంలో తమ వద్ద ఉన్న పత్తి పరిమాణాన్ని సరిగ్గా నమోదు చేసుకోవాలని సూచించారు. సరైన వివరాలు నమోదు చేస్తేనే కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయం సజావుగా జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ మార్పులు డిసెంబర్ 25 నుంచి పూర్తిగా అమల్లో ఉన్నాయని, రైతులు ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా వ్యవహరించాలని సీసీఐ విజ్ఞప్తి చేసింది.


